ఢిల్లీ: అణచివేత.. దమనకాండలపై ఎగురవేసిన ధిక్కార పతాక చాకలి ఐలమ్మ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి… నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ ఊదిన యోధురాలు ఐలమ్మ అని సీఎం అన్నారు. సమ్మక్క.. సారక్క…చాకలి ఐలమ్మల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని సీఎం గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.