రాష్ట్రవ్యాప్తంగా 2025-26 పత్తి మార్కెటింగ్ సీజన్ ప్రారంభానికి ముందు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేతివృత్తులు మరియు వస్త్రశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పత్తి ఉత్పత్తి, మార్కెట్ ధరల పరిస్థితి, MSP అమలు, రైతులకు చెల్లింపులు, జిన్నింగ్ & ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాట్లు, రవాణా సమస్యలు, డిజిటలైజేషన్, రైతుల రిజిస్ట్రేషన్, స్థానిక కమిటీలు, ఫిర్యాదు పరిష్కారం వంటి అనేక అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. CCI ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పత్తి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని, దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం కొన్ని నూతన విధానాలు ప్రవేశపెట్టామని అన్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ సహాయం అందించాలని మంత్రిగారిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో పండే పత్తి ప్రత్యేక నాణ్యత కలిగినదని మంత్రి వివరించారు. ప్రస్తుతం మార్కెట్ ధరలు MSP కంటే క్వింటాల్కు రూ.1099 తక్కువగా ఉన్నాయని, ఇది రైతులకు ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. కాబట్టి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సీసీఐ సమర్థవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు.
అక్టోబర్ నెల నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేసుకోవాలని, రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను 110 నుండి 122కి పెంచినట్లు మంత్రి వెల్లడించారు. అదనంగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా కొనరావుపేట AMC కేంద్రాన్ని కూడా చేర్చాలని సూచించారు. రైతులు తమ పత్తిని సులభంగా విక్రయించుకునేందుకు జిన్నింగ్ & ప్రాసెసింగ్ మిల్లులు, గోదాములు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రైతులకు MSP చెల్లింపులు పూర్తిగా ఆధార్ ఆధారిత ధృవీకరణ తర్వాతే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. దీంతో రైతులకు పారదర్శకంగా, ఆలస్యం లేకుండా చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
CCI ప్రవేశ పెట్టిన “కపాస్ కిసాన్” యాప్ ద్వారా రైతులు స్వయంగా స్లాట్ నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఈ యాప్ పై AEO లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, వారి ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులు కూడా OTP ఆధారంగా నమోదు చేసుకునే వీలుంటుందని, అయితే వారి వివరాలు సంబంధిత పట్టాదారు ధృవీకరించిన తర్వాతే ఆమోదం పొందుతాయని తెలిపారు. ఈ విధానం వల్ల అర్హత కలిగిన ప్రతి రైతు MSP ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు L1,L2 స్లాట్ల ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని, అలాకాకుండా నూతన పద్ధతిలో సెంటర్ కు 10,15 కి.మి పరిధిలో ఉండేలా సెంటర్ ను కేటాయించాలని సూచించారు. రైతుల పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో స్థానిక మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీలు తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పర్యవేక్షిస్తాయి. రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779, వాట్సాప్ హెల్ప్లైన్ 88972 81111 కొనసాగుతాయని తెలిపారు.
ప్రతి కొనుగోలు కేంద్రం మరియు జిన్నింగ్ & ప్రాసెసింగ్ మిల్లులలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, రోజువారి క్రయ విక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూం సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. రవాణా సమస్యలపై మంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్థానిక రవాణా సంఘాలు అధిక ధరలు వసూలు చేస్తున్నందున, గోదాముల నుండి మిల్లులకు పత్తి రవాణాలో ఆటంకాలు కలుగుతున్నాయని గుర్తించారు. ఈ సమస్యలను తక్షణం పరిష్కరించేలా రవాణా శాఖ, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. CCI కొనుగోలు విధానంలో కొన్ని మార్పులపై కూడా చర్చ జరిగింది. లింట్ శాతం పెంపు, కొరత శాతం లెక్కింపు, జిన్నింగ్ మిల్లుల పాల్గొనకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గారు సూచించారు. సీసీఐ టెండర్ నిబంధనలు పారదర్శకంగా ఉండాలని అన్నారు. రైతుల MSP రక్షణకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి గారు వివరించారు. ఈ కమిటీలు ధరల అమలును పర్యవేక్షించి, సీసీఐతో సమన్వయం చేసేలా ఉంటాయి. జిల్లా కలెక్టర్లు సీజన్ ప్రారంభానికి ముందే ఈ కమిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రైతులకు MSP హామీగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని , పత్తి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, పారదర్శకంగా మరియు వేగంగా కొనుగోళ్లు జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్లు, రైతు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే ఈ సీజన్ విజయవంతమవుతుందని మంత్రి గారు విశ్వాసం వ్యక్తం చేశారు.