- వరదలోకి పరిశ్రమల వ్యర్థ్యాలు
- నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న కాలుష్య నియంత్రణ మండలి
- కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేవరు…?
- కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని పిసిబి అధికారులు
- అడ్డు అదుపులేకుండా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్న పరిశ్రమలు
- తమకు దేవుడే దిక్కంటున్న కాలుష్య బాధితులు
- పీసీబీ అధికారులు దృష్టిసారిస్తే అరికట్టలేరా..?
గత కొన్ని రోజులుగా తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అదనుగా పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలను వరదలోకి వదులుతున్నారు. ఆ కాలుష్య జలాలు స్థానిక చెరువులు, కుంటల్లోకి చేరుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు రసాయన పరిశ్రమలున్న ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రమైంది. ఏ చెరువులో చూసినా కాలుష్య నురగలు, ముక్కుపుటాలు అదిరేలా ఘాటు వాసనలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు వస్తే అందరూ పండుగ చేసుకుంటారు. ఇక్కడి ప్రజలు మాత్రం వర్షాలు రావోద్దని కోరుకుంటారు. కారణం కాలుష్య పరిశ్రమలు వదిలే వ్యర్ధాల వరదతో పాటు, గాలిలోకి వదిలే కాలుష్య వాసనలతో పరిశ్రమల ప్రాంతాలలో నివసించే ప్రజలు ప్రతిరోజు నరకం చూస్తున్నాం అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడ, పటాన్ చెరువు, మేడ్చల్, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, జిన్నారం, గడ్డపోతారం, చౌటుప్పల్, బీబీ నగర్, చిట్యాల లాంటి ప్రాంతాలలో కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. కాలుష్య బాధిత ప్రాంతాల ప్రజల కష్టాలు అన్నీ, ఇన్నీ కావు కాలుష్య పరిశ్రమలు వదిలే కాలుష్యంతో భూగర్భ జలాలు విషంగా మారడమే కాకుండా.. గాలి కాలుష్యం కూడా విపరీతంగా చేయడంతో రకరకాల రోగాలతో బాధపడుతున్నాం అని వాపోతున్నారు. బొల్లారం మున్సిపాలిటీ, జిన్నారం, గుమ్మడిదల మండల్లాలోని కిష్టాయి పల్లి, గడ్డపొతారం, బొంతపల్లి, ఖాజీపల్లి, బొల్లారం, పటాన్ చెరువు, మేడ్చల్ మండల పరిధిలో మరియు చౌటుప్పల్ మండల పరిధిలోని దొతిగూడెం, అంతమ్మ గూడెం, కొయ్యలగూడెం ఇంకా అనేక గ్రామాలు కాలుష్య పరిశ్రమలు వదిలే వ్యర్ధ జలాల వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య పరిశ్రమలు వర్షం పడుతున్న సమయంలో వ్యర్ధ జలాలను వదలడమే కాకుండా, గాలిలోకి కూడా కాలుష్యాన్ని విపరీతంగా వదులుతుండటంతో కాలుష్య పరిసర ప్రాంతాల ప్రజలు ఆ విషపు వాసనలతో నరకం చూస్తున్నాం అంటున్నారు. కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై ఫిర్యాదులు చేస్తే పిసిబి అధికారులు నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారు అని వాపోతున్నారు.
ఇందులో మరి ముఖ్యంగా బొల్లారం పారిశ్రామిక వాడను మినీ ఇండియాగా కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం ఆర్ధికంగా ఎంత అభివృద్ది చెందిన కూడా ఇక్కడ నివసించే ప్రజలు పడే ఇబ్బందులను మాత్రం పట్టించుకునే నాదుడే లేడు. మరీ ముఖ్యంగా కొన్ని కాలుష్య పరిశ్రమల యాజమాన్యాలు వర్షాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వర్షాలు పడుతుండటమే ఆలస్యం వారి వారి పరిశ్రమలో ఇంతకు ముందు నుంచే నిల్వ ఉంచిన వ్యర్ద జలాలను వర్షపు నీటితో కలిపేసి చుట్టూ ప్రక్కల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలోకి మరియు బోర్ల ద్వారా భూగర్భంలోకి వదులుతూ చెరువులను కుంటలనే కాకుండా భూగర్భ జలాలను కూడా విపరీతంగా కలుషితం చేస్తున్నారు అంటున్నారు. కాలుష్య ప్రాంతాల ప్రజలు పంట పొలాల కోసం, త్రాగు నీటి కోసం బోరులు వేస్తే అందులో నుంచి వచ్చే నీరు కూడా పూర్తిగా విషపు (పసుపు) వ్యర్ధ జలలే వస్తున్నాయి అని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య పరిశ్రమల పరిధిలోని చెరువులు, కుంటలలోని నీరు విషపు వ్యర్ద జలాలతో పూర్తిగా కలుషితం అయిపోయింది అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి కుంటలు, చెరువులు, నాలాల పక్కనే ఉన్న కాలుష్య పరిశ్రమలు రాత్రి అయ్యేదే ఆలస్యం గుట్టు చప్పుడు కాకుండా తమ దగ్గర నిల్వ ఉంచిన వ్యర్ధ జలాలను వీటిలోకి వదులుతున్నారు. ఈ పరిశ్రమలే కాకుండా సిమెంట్ పరిశ్రమలు కూడా విపరీతమైన కాలుష్యం చేస్తూ పక్కనే ఉన్న కృష్ణ నది స్వచ్చమైన నీటిని కూడా పాడుచేస్తున్నాయి. ఇలాంటి చర్యలతో పూర్తిగా స్వచ్చమైన నీరు కాస్తా వ్యర్ద జలాలుగా మరీ దేనికి పనికి రాకుండా పోవడమే కాక అక్కడ నివసించే ప్రజలకు, పశువులకు, పక్షులకు తాగు నీరు దొరకక విపరీతమైన కొరత ఏర్పడుతుంది అని వారి బాధను పలువులు పర్యావరణ వేత్తల దగ్గర వాపోతున్నారు.
ఈ కాలుష్య ప్రాంతాలలోని ప్రజలు విపరీతమైన కాలుష్య వ్యర్ద జలాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి భూగర్భ జలాలు కలర్ కలర్ గా రావడమే కాకుండా ఈ జలల్లో 2000, 3000 టిడిఎస్ వస్తుంది. ఈ వాటర్ బట్టలు ఉతుకోవడం, స్నానం చేయడానికి కూడా పనికి రాని పరిస్థితి ఉందంటున్నారు. అన్ని అవసరాలకు నీరు కొనుగోలు చేయాలంటే తమ ఆర్ధిక పరిస్థితి సరిపోవడం లేదని అంటున్నారు. మంచి నీరు తెచ్చుకోవాలంటే 5 నుంచి 10 కిలో మిటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది అని తమగోడును వెళ్లబోసుకుంటున్నారు. తమ కాలుష్య బాధలను పట్టించుకోవాలని ఎన్ని సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదు చేసిన సదరు పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఈ కాలుష్య పరిశ్రమల వ్యర్ద జలాలను పటాన్ చెరువులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఇటిపికు తరలించాలి. అక్కడ ఆ వ్యర్ధ జలాలను శుద్ది చేయడం జరుగుతుంది. ఈ వ్యర్ద జలాలను సిఇటిపికు తరలించాలి అంటే ఒక్క ట్యాంకర్ కు రూ.10 వేల రూ.15 వేల వరకు చెల్లించాల్సి ఉంటది. ఈ ఖర్చును తప్పించుకోవడానికి కాలుష్య పరిశ్రమలు వర్షపు నీటిలో ఈ వ్యర్ధ జలాలను కలిపి చెరువులు, కుంటలు, నాలాలు, భూగర్భంలోకి వదిలి స్వచ్చమైన నీటిని విషపు నీరుగా మారుస్తున్నారు.
నక్కవాగు నుంచి మంజీరాలోకి..
పటాన్ చెరు నియోజకవర్గంలోనే అతి పెద్దదైన జిన్నారం రాయుని చెరువు బొంతపల్లి, దోమడుగు ప్రాంతాల్లోని రసాయన పరిశ్రమల వల్ల విషపూరితమైంది. నీటి రంగుమారి అలుగు నుంచి నురగలు కక్కుతూ పారుతోంది. గడ్డపోతారం అయ్యమ్మ చెరువుదీ ఇదే పరిస్థితి. ఖాజీపల్లి పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య జలాలు ఖాజీపల్లి ఖాజీచెరువు, అక్కడి నుంచి గండి చెరువు మీదుగా నురగలు కక్కుతూ కిష్టారెడ్డిపేట, సుల్తాన్ పూర్ లోని చెరువుల్లోకి చేరుతోంది. అక్కడి నుంచి నక్క వాగులో కలుస్తోంది. ఆ తర్వాత మంజీరా నదిలోకి చేరుతోంది. ఐడీఏ బొల్లారం పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య జలాలు సైతం ఇక్కడికే చేరుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఇస్నాపూర్ పెద్ద చెరువులోకి భారీగా పారిశ్రామిక కాలుష్య జలాలు చేరుతున్నాయి. వర్షపు నీటితో పాటు పరిశ్రమల నుండి కాలుష్య జలాలు వస్తుండటంతో ఇస్నాపూర్ పెద్ద చెరువు అలుగు పోసి రుద్రారం చెరువులోకి వెళ్తున్నాయి. అక్కడ కాలుష్య జలాలు ప్రవహిస్తుండటంతో పరిసరాల్లో దుర్వాసన వెదజల్లుతున్నది. పాశమైలారం పారిశ్రామిక వాడలో ఫేస్-1, ఫేస్-2 లో ఫార్మా, బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమలు భారీగా ఉన్నాయి. వీటిలో పలు పరిశ్రమలు వారి వద్ద నిల్వ ఉన్న కాలుష్య రసాయన జలాలను వర్షపు నీటిలో వదిలేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల పటాన్ చెరు, ఇస్నాపూర్, పాశమైలారం చెరువులు కాలుష్యమయంగా మారుతున్నా.. పట్టించుకునే వారు కరవయ్యారనే విమర్శలొస్తున్నాయి.
ఏదులాబాద్లో ఇదే దుస్థితి
గ్రేటర్ పరిధిలోని పరిశ్రమలకు ఏదులాబాద్ చెరువు అడ్డగా మారుతున్నది. వర్షాకాలం వచ్చిందంటే వరదలోకి రసాయనాలను వదిలి మిగతా చెరువును కాలుష్యం చేస్తున్నారు. ఇది ప్రతి వర్షాకాలం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి ఏదులాబాద్ చెరువుకు భారీగా వరద పోటెత్తుతోంది. వరదతో పాటు బొల్లారం, నాచారం పారిశ్రామిక వాడల నుంచి వచ్చిన విష రసాయనాలు, జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి కలుషిత నీరు చేరడంతో భారీ మొత్తంలో చేపలు మృత్యువాత పడ్డాయి. కలుషిత నీటి ప్రభావంతో చెరువలోని రూ.10 లక్షల విలువైన చేపలు చనిపోయాయని ఏదులాబాద్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, సెక్రటరీ బాలయ్య చెబుతున్నారు.
తమ జీవనాధారమైన చెరువును కాలుష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలం వరదలొచ్చిన సమయంలో పెద్ద మొత్తంలో చేపలు మృత్యువాత పడుతున్నాయని వాపోతున్నారు. కలుషిత నీటిని పంట సాగుకు వాడటం వల్ల వ్యాధుల బారిన పడి దిగుబడి తగ్గుందని చెబుతున్నారు. ఆ పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకుని తాము కూడా వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న కలుషిత నీటిని అరికట్టి తమను న్యాయం చేయాలని కోరుతున్నారు.
పీసీబీ అధికారులు దృష్టిసారిస్తే అరికట్టలేరా..?
పీసీబీ అధికారులు దృష్టి సారించి విచారిస్తే.. కాలుష్య కారకులను పట్టుకునే అవకాశం ఉందని స్థానికులు సూచిస్తున్నారు. ప్రతి నెలా ఏ పరిశ్రమ నుంచి ఎంత మేరకు రసాయన వ్యర్థ జలాలు వస్తున్నాయి..? వాటిని ఈటీపీలకు తరలిస్తున్నారా..? లేదా..? అనేది క్షేత్ర పరిశీలనలో తేలుతుంది. పీసీబీ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోని తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినప్పుడు నమూనాలు సేకరించి.. ఆ తర్వాత మిన్నకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి.