- KWDT-II ముందు వాదనలు
- మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కృష్ణా ట్రైబ్యునల్లో తెలంగాణ తుది వాదనలు.
- కృష్ణా–గోదావరి జలాల్లో హక్కుల కోసం రాజీలేని పోరాటం
- అల్మట్టి ఎత్తు పెంపు అంశంపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తాం
హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్-II (KWDT-II) ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని, మొత్తం 1050 టీఎంసీలలో దాదాపు 70% అంటే 763 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయిస్ మంత్రి కాప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 23న ఢిల్లీలో మళ్లీ ప్రారంభమైన కృష్ణ ట్రైబ్యునల్ విచారణల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు చివరి దశకు చేరుకుందని, ఫిబ్రవరి నుండి తెలంగాణ తుది వాదనలు వినిపిస్తున్నదని ఉత్తమ్ చెప్పారు. ఈ విచారణలు సెక్షన్-3 రిఫరెన్స్ కింద జరుగుతున్నాయని, అన్ని పిటిషన్లు పూర్తయ్యాయని గత కొన్ని నెలలుగా సీనియర్ అడ్వకేట్ ఎస్.వైద్యనాథన్ తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్నారని, ఆయనకు మూడు రోజుల సమయం కేటాయించబడిందని తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ ముందు స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి హాజరుకావడం బహుశా దేశంలో ఇదే మొదటి సారి అయి ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంతగానో సీరియస్గా తీసుకుంతుందో అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
గత కేటాయింపులను వివరించిన ఉత్తమ్, KWDT-II అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలు కేటాయించిందని గుర్తు చేశారు. వీటిలో 811 టీఎంసీలు 75% డిపెండబిలిటీ ఆధారంగా, 49 టీఎంసీలు 65% డిపెండబిలిటీ ఆధారంగా, 145 టీఎంసీలు సగటు ప్రవాహాల ఆధారంగా కేటాయించబడ్డాయి. అదనంగా గోదావరి డైవర్షన్ ద్వారా 45 టీఎంసీలు ఇచ్చారు. మొత్తంగా 1050 టీఎంసీలు కేటాయించబడ్డాయి. సగటు ప్రవాహాల కంటే ఎక్కువగా వచ్చే నీటిని వినియోగించుకోవచ్చని కూడా స్వేచ్ఛ ఇచ్చారు. 2014లో తెలంగాణ వేరుగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా బేసిన్ పారామీటర్ల ఆధారంగా వాటాను కోరుతోందని
ఉత్తమ్ తెలిపారు, తెలంగాణ డిమాండ్ శాస్త్రీయమైనది, అంతర్జాతీయంగా అంగీకరించబడిన పారామీటర్ల మీద ఆధారపడి ఉందని. క్యాచ్మెంట్ ఏరియా, బేసిన్లోని జనాభా, కరవు ప్రాంతం విస్తీర్ణం, సాగు భూములు వంటి అంశాల ఆధారంగా లెక్కలు వేసి 75% డిపెండబుల్ వాటర్లో 555 టీఎంసీలు, 65% డిపెండబుల్ వాటర్లో 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల నుండి 120 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ నుండి మొత్తం 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని కోరుతున్నారు. మొత్తంగా ఇది 763 టీఎంసీలుగా అవుతుంది. సగటు ప్రవాహాలపై మిగిలిన అదనపు నీటిని వినియోగించే స్వేచ్ఛ కూడా తెలంగాణదేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించబడిన 811 టీఎంసీల్లో పెద్ద భాగాన్ని బేసిన్ వెలుపలికి మళ్లించిందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి ఆపాలని, బదులుగా ప్రత్యామ్నాయ వనరులను వినియోగించాలని ట్రైబ్యునల్ ముందు తెలంగాణ విన్నవించుకుందని అన్నారు. “అలా మిగిలిన నీటిని ప్రాంతాలలో వాడుకోవాలి.
సగటు ప్రవాహాలపై మిగిలిన మొత్తం నీటిని వినియోగించే హక్కు తెలంగాణకే ఉందని, దీన్ని ట్రైబ్యునల్ ముందు బలంగా వాదిస్తామని అన్నారు. ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాకుండా, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే చర్య అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలను తెలంగాణకే కేటాయిస్తూ, 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఒప్పందానికి అంగీకరించడం రైతులకూ, కరవు ప్రాంతాలకూ మోసం చేశారని ఉత్తమ్ అన్నారు. “దాదాపు పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని అంగీకరించింది. అందుకే ఇప్పుడు ఆ ఫైలును మళ్లీ తెరిచి మొదటి నుంచి వాదనలు వినిపిస్తున్నాం. 299 టీఎంసీలు అంగీకరించిన గత ఒప్పందం, మేం కోరుతున్న 763 టీఎంసీల మధ్య వ్యత్యాసమే ఈ అన్యాయానికి నిదర్శనం,” అని అన్నారు. జలశక్తి మంత్రిత్వశాఖలో కూడా ఆ ఒప్పందం నమోదైనప్పటికీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా తిరస్కరించిందని చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాజీపడబోదని అన్నారు. “కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో టిడిపి ఉన్నా, మహారాష్ట్రలో బిజెపి ఉన్నా, తెలంగాణ తన హక్కుల కోసం కఠినంగా పోరాడుతుంది. ఒక్క చుక్క నీళ్లను కూడా వదులుకోదు,” అని ధీమా వ్యక్తం చేశారు.
అల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే కర్ణాటక యోచనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి నిర్ణయం తెలంగాణకు నేరుగా నష్టం చేస్తుందని హెచ్చరించారు. దీనిని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని అన్నారు. “మా ప్రభుత్వ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ వాటా తగ్గించే చర్య ఏదీ అనుమతించం. అల్మట్టి ఎత్తు పెంపు అనుమతించకుండా సుప్రీంకోర్టులో పోరాడతాం,” అని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసుపై సమీక్ష సమావేశం నిర్వహించి, పూర్తి స్థాయి వాదనలు వినిపించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఉత్తమ్ తెలిపారు. “ఇది కేవలం న్యాయ పోరాటం మాత్రమే కాదు, రైతుల జీవనాధారానికి, కరవు ప్రాంతాల భవిష్యత్తుకు సంబంధించినది,” అని అన్నారు. ట్రైబ్యునల్ న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని విచారణలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. “మేము మా వాదనలను అన్ని ఆధారాలతో సమర్పించాం. ఈ సారి తెలంగాణకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది,” అని ఉత్తమ్ అన్నారు. ప్రజలకు హామీ ఇస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఆయన చెప్పారు. “డిపెండబుల్ ఫ్లోస్ అయినా, సగటు ప్రవాహాలు అయినా, అదనపు నీరు అయినా, గోదావరి డైవర్షన్లు అయినా—తెలంగాణల తన హక్కు కోసం పోరాడుతుంది. చారిత్రక అన్యాయం ఇకపై కొనసాగదు. తెలంగాణ తన హక్కు దక్కించుకుంటుంది,” అని ఉత్తమ్ స్పష్టం చేశారు.