మొక్కజొన్న, జొన్న పంటలను PSSలో చేర్చాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

  • Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితిని తొలగించాలి
  • కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్య ఆర్థిక విధానం అవసరం
  • ఆయిల్ పామ్ తో పాటు పత్తి రైతులపై ప్రభావం చూపుతున్న కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానాలు

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి లేఖ రాసిన మంత్రి తుమ్మల ఈ రోజు “పీఎం ధన్ ధాన్య కృషి యోజన” మరియు “నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్” పథకాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అభినందననలు తెలియజేస్తూ.. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రి అభినందిస్తూనే, రాష్ట్రంలో అమలవుతున్న PSS పథకంలో ఉన్న పరిమితులు, ప్రధాన పంటల కొనుగోలుపై కేంద్రం చూపెడుతున్న నిర్లక్ష్యం మరియు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్న కేంద్ర వాణిజ్య విధానాల గురించి లేఖ ద్వారా తెలియజేశారు.

Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితి తొలగించాలి :
ప్రస్తుతం PSS పథకం కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్, పెసళ్ళు వంటి పంటలపై కేంద్రం 25% సీలింగ్ విధించడం వలన, రైతులు తాము పండించిన పంటలో కేవలం 25% మాత్రమే మద్ధతు ధరకు అమ్ముకొనే వెసులుబాటు కలుగుతుందని, తెలంగాణలాంటి రాష్ట్రాలలోని భూముల్లో నువ్వులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్, పెసళ్ళు వంటి పంటలు విస్తారంగా సాగవుతాయని, ఈ పరిమితిని విధించడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌లో ధరలు పడిపోయిన సమయంలో రైతుల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ ఫెడ్ మరియు సహకార సంస్థల ద్వారా కేంద్రం విధించిన 25% సీలింగ్ కంటే ఎక్కువ కొనుగోళ్లు చేయవలసి వస్తోందని, దీని వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. అందువల్ల, PSS కింద ఉన్న 25% కొనుగోలు పరిమితిని రద్దు చేయాలని లేదా సడలించాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల కోరారు.

మొక్కజొన్న, జొన్న పంటలను PSSలో చేర్చాలి : తెలంగాణలోని వర్షాధార పంటలలో మొక్కజొన్న, జొన్న పంటలు ప్రధానమైనవని మంత్రి తుమ్మల గారు పేర్కొన్నారు. ఈ పంటలకు కనీస మద్దతు ధర (MSP) ప్రకటించినప్పటికీ, కేంద్రం ద్వారా కొనుగోలు జరగకపోవడం వల్ల, రాష్ట్రం తన స్వంత నిధులతో రైతులనుండి కొనుగోలు చేసి, రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సివస్తోందని చెప్పారు. రైతులకు నిర్దేశిత మద్దతు ధర భరోసా కల్పించేందుకు ఈ రెండు పంటలను PSS పథకం పరిధిలోకి తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్య ఆర్థిక విధానం అవసరం : కనిష్ట మద్ధతు ధర (MSP) అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికి, దాని భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతోందని మంత్రి తుమ్మల గారు పేర్కొన్నారు. రైతు కష్టకాలంలో ఉన్నప్పుడు, రైతులకు గిట్టుబాటు ధర అందని సమయాలలో రాష్ట్రం జోక్యం చేసుకొని, కేంద్రం ప్రకటించిన కనిష్ట మద్ధతు ధర చెల్లించి రైతులను కాపాడుకోవాల్సి వస్తుందని, కానీ కేంద్ర ఆర్థిక మద్దతు లేకుండా ఇది దీర్ఘకాలంగా కొనసాగడం అసాధ్యం అని చెప్పారు. కాబట్టి, MSP అమలు మరియు మార్కెట్ జోక్యాల్లో కేంద్ర-రాష్ట్రాల మధ్య వ్యయభారం పంచుకునే ఆర్థిక విధానం రూపుదిద్దాలని మంత్రి సూచించారు.

ఆయిల్ పామ్ తో పాటు పత్తి రైతులపై ప్రభావం చూపుతున్న వాణిజ్య విధానాలు :
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) పథకం అమలులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.08 లక్ష హెక్టార్లలో 73,744 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, 2025-26 లో మరో 50,000 హెక్టార్ల విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మే 31, 2025న క్రూడ్ పామ్ ఆయిల్‌పై కస్టమ్స్ సుంకాన్ని 27.5% నుండి 16.5%కి తగ్గించడం వలన దేశీయ ధరలు తీవ్రంగా పడిపోయి, ఆయిల్ పామ్ రైతులు పొందే తాజా ఫ్రూట్ బంచ్ (FFB) ధర టన్నుకి ₹20,000 కంటే తక్కువకు చేరిందని తెలిపారు. అదే విధంగా, పత్తి విషయంలో సీసీఐ కొనుగోళ్లు 50–60% వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయని, నాణ్యత పరమైన కారణాలు మరియు కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా రైతులకు MSP లభించడం లేదని మంత్రి అన్నారు. అంతేకాకుండా కాటన్ దిగుమతులపై దిగుమతి సుంకం మినహాయింపు చేయడం వలన కూడా దేశీయ ధరలు మరింతగా పడిపోయాయని తెలిపారు. ఈ వాణిజ్య విధానాలు రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, కాబట్టి ఆయిల్ పామ్ మరియు పత్తిపై దిగుమతి సుంక విధానాలు దేశీయ మార్కెట్ సీజన్‌లకు అనుగుణంగా ఉండేలా ఆర్థిక మంత్రిత్వ శాఖతో సమన్వయం చేయాలని ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

కేంద్రం మరియు రాష్ట్రాల సమన్వయంతోనే రైతు రక్షణ సాధ్యం :
PSS లో పంటల కొనుగోళ్లపై విధించిన పరిమితులు, రాష్ట్ర ప్రధాన పంటలను PSS పథకం నుండి మినహాయించడం మరియు కేంద్ర అనాలోచిత వాణిజ్య విధానాల వల్ల తెలంగాణ రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కేంద్ర-రాష్ట్ర సమన్వయం ద్వారా మాత్రమే రైతులు కోరుకునే కనీస మద్దతు ధరపై రైతులకు భరోసా కల్పించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.