నల్లగొండ బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్ కు “కోమటి రెడ్డి ప్రతీక్” పేరు

  • సుమారు 8 కోట్లతో నూతన స్కూల్ భవన నిర్మాణం చేసిన కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్

హైదరాబాద్: నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్ కు “కోమటి రెడ్డి ప్రతీక్” ప్రభుత్వ పాఠశాల గా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రైమరీ& హై స్కూల్ స్థానంలో కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా అత్యఅధునాతన సౌకర్యాలతో నూతన భవన నిర్మాణానికి పూనుకున్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 8కోట్ల వ్యయంతో నూతన స్కూల్ భవన నిర్మాణం చేశారు. ఈ పాఠశాలను తెలంగాణలో టాప్ మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. 1,2వ తరగతి నుండే పిల్లలు ప్రపంచంతో పోటీపడే విధంగా ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు వీలుగా కంప్యూటర్ విద్య,డిజిటల్ క్లాసులు,ఇంగ్లీష్,ఉర్దూ మీడియం బోధనకు బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నియమించనున్నట్లు తెలిపారు. కార్పోరేట్ కు దీటుగా మెరుగైన విద్యా “కోమటి రెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ప్రభుత్వ స్కూల్లో అందనుందని, స్కూల్లో అడ్మిషన్ కోసం కార్పోరేట్ స్కూల్స్ కంటే డిమాండ్ పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్ని రకాల సకల సౌకర్యాలతో కూడిన పక్కా భవనంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో బొట్టుగూడ స్కూల్ నిర్మించామని,రానున్న మూడేళ్లలో దశల వారీగా నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు అధునాతన సౌకర్యాలతో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బొట్టుగూడ స్కూల్ తో అది ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఇప్పటికే నల్గొండలో సుమారు 10కోట్ల విలువ గల కోమటి రెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాల అధునాతన కాంప్లెక్స్ భవనం నిర్మించామని, తిప్పర్తి,కనగల్ జూనియర్ కళాశాలలు కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోడల్ కాలేజీలుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. PHC ల అప్ గ్రేడ్ కు శ్రీకారం చుట్టినట్టు గుర్తు చేశారు.

బొట్టుగూడ ప్రభుత్వ స్కూలే కాకుండా పేదలకు నాణ్యమైన విద్యా,వైద్యం అందించడమే లక్ష్యంగా ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వ పాఠశాలలు,కాలేజీలు,ప్రభుత్వ ఆసుపత్రులు కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరుగు పరుస్తున్నామని గుర్తు చేశారు. ఇటీవల నల్గొండ GGH లో హైదరాబాద్ టాప్ కార్పోరేట్ హాస్పిటల్స్ లో కూడా లేని అధునాతన లాప్రోస్కోపీ యూనిట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, గైనకాలజిస్ట్ విభాగాన్ని అభివృద్ధి తెలిపారు. బొట్టుగూడ స్కూల్ కు తన కుమారుడు “కోమటి రెడ్డి ప్రతీక్” ప్రభుత్వ పాఠశాల గా నామకరణం చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు. జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డికి, అందుకు కృషి చేసిన అధికారులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఒకటి,రెండు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభిస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.