కానిస్టేబుల్‌ ప్రమోద్‌కుమార్‌ కుటుంబానికి కోటి పరిహారం

  • కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం
  • బాధిత కుటుంబానికి డీజీపీ శివధర్‌రెడ్డి పరామర్శ

రౌడీషీటర్‌ రియాజ్‌ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్‌ ప్రమోద్‌కుమార్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ వెళ్లిన డీజీపీ… ప్రమోద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పోలీస్‌ కమిషనరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రమోద్‌ కుటుంబానికి కోటి రూపాయ ల పరిహారం, సెప్టెంబర్‌లో ప్రమోద్‌కు వచ్చినంత మొత్తం లో జీతం.. ఆయన రిటైర్మెంట్‌ వయసు వరకు కుటుంబానికి అందుతుందని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం, పోలీస్‌ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్‌ వెల్ఫేర్‌ నుంచి రూ.8 లక్షల పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నా రు.

రియాజ్‌ను పట్టుకునేందుకు ఆసిఫ్‌ అనే వ్యక్తి అందించిన సహకారం మరువలేనిదని అభినందించారు. ఆసిఫ్‌ భార్యకు రూ.50 వేల సాయం అందజేశారు. ఈ సందర్భంగా రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై స్పందించేందుకు డీజీపీ నిరాకరించారు. మానవ హక్కుల కమిషన్‌ సమోటో కేసు విచారణ దశలో ఉన్నందున మాట్లాడలేమని చెప్పారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు సాయంత్రమే జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ విచారణ చేశారని తెలిపారు. తెలంగాణలో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న నేరస్థులను కఠినంగా అణచివేస్తామని మరో ప్రకటనలో స్పష్టంచేశారు. రియాజ్‌ చేతిలో దారుణ హత్యకు గురైన కానిస్టేబుల్‌ ప్రమోద్‌కు పోలీసుశాఖ తరుపున నివాళులు అర్పించారు. తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసుశాఖ నిబద్ధతతో ఉన్నదని పేర్కొన్నారు.