మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఈ రోజు సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం జాతరకి గిరిజన సంక్షేమ శాఖ రూ. 150.00 కోట్లు మంజూరు చేయగా అందులో రూ. 90.00 కోట్లు సివిల్ వర్క్స్ కు, రూ. 60.00 నాన్ సివిల్ వర్క్స్ కు ఉద్దేశించారు. ఈ సమావేశంలో సివిల్ వర్క్స్ స్టేటస్, నాన్ సివిల్ వర్క్స్ యాక్షన్ ప్లాన్ మీద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్యసాచి ఘోష్ ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్ తో కలిసి మాట్లాడుతూ.. మేడారం జాతర ఏర్పాట్లను మొత్తం 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. జోన్–3 జంపన్న వాగు ప్రాంతంగా నిర్ణయించబడింది. జాతర సమయంలో 10 నుండి 12 వేలమంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి జోన్కు ఒక జోనల్ ఆఫీసర్ను నియమించనున్నారు.
24 శాశ్వత టవర్స్, 20 సెల్-ఆన్-వీల్స్, 350 వై-ఫై పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కోర్ రూట్లు మరియు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. మొత్తం 49 పార్కింగ్ ప్రదేశాలు (1050 ఎకరాలు) గుర్తించబడి, దాదాపు 4.5 నుండి 6 లక్షల వాహనాలు నిలిపే సదుపాయం కల్పించబడుతుంది. ఈ ఏర్పాట్లు నవంబర్ 30 నాటికి పూర్తవుతాయని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 24+9 ఫారెస్ట్ రోడ్లు (కచ్చా నుండి డబుల్ లేన్) రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో భాగంగా వైల్డ్లైఫ్ శాంక్చువరీలోని రహదారులు కూడా చేర్చబడ్డాయి. ఆర్ & బీ శాఖ ద్వారా 42 కోట్లతో ఆలయం చుట్టూ రహదారులు, మరియు 92 కోట్లతో ప్రధాన రహదారులు నిర్మించబడుతున్నాయి. జాతర సమయానికి ముందు, మధ్య మరియు తరువాత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక జాతర సందర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జంపన్న వాగు వద్ద తాత్కాలిక రహదారి కూలిపోయిన కారణంగా మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయి. 517 బోరుపాయింట్లు/నీటి వనరులు, 250 కిలోమీటర్ల రహదారులపై లైటింగ్ పనులు జరుగుతున్నాయి. స్థానికుల సహకారంతో 6 స్లాటర్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. జంపన్న వాగు పునరుద్ధరణ పనులు సాగిస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. 9,111 విద్యుత్ స్తంభాలు, 259 ట్రాన్స్ఫార్మర్లు అమర్చే పనులు విద్యుత్ శాఖ చేపట్టింది. జాతర ప్రాంతమంతా ఎండోవ్మెంట్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశ ఏర్పాట్లు (ఇల్యూమినేషన్) చేయనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని శ్రీ సబ్యసాచి ఘోష్ ఆదేశించారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ములుగు ఎస్పీ, ఎలక్ట్రిసిటీ CMD శ్రీ వరుణ్ రెడ్డి, ఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొని తమ తమ ఇన్పుట్ అందించారు.