రూ.1,032 కోట్లు ఒకేసారి విడుదలకు డిప్యూటీ సీఎం ఆదేశం

  • ఉద్యోగుల బకాయిలు 712 కోట్లు క్లియర్
  • ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ పెండింగ్ బిల్లులు రూ.320 కోట్లు విడుదల
  • డిప్యూటీ సీఎం ఆదేశంతో బిల్లులు చెల్లించిన ఆర్థిక శాఖ

ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు 1,031 కోట్ల రూపాయలను ఒకేసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ మాసానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 712 కోట్ల రూపాయలను డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా 10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు 320 కోట్ల రూపాయలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు విడుదల అధికారులు చేశారు. రోడ్లు మరియు భవనాల శాఖకు చెందిన రూ.10 లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం 225 కోట్ల రూపాయలను సైతం విడుదల చేశారు. సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.