భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయండి: సీఎస్ రామకృష్ణారావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకనుగుణంగా మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 24 జిల్లాలు ఈ మొంథా తుఫాన్ కు ప్రభావితమయ్యాయని తెలిపారు. జిల్లాలలో జరిగిన పంట నష్టం తో పాటు, రహదారులు, నీటి వనరులు, పశువులు, ప్రాణ నష్టంతో పాటు ఇతర ప్రాథమిక వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏవిధమైన సూచనలు లేకుండా 25 నుండి 30 సెంటీమీటర్ల వర్షపాతం ఆకస్మికంగా కురుస్తోందని, ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లాల వారీగా ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సి.ఎస్ సూచించారు. తుఫాన్ ప్రభావంతో ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ లైన్లు, నీటి వనరులకు తాత్కాలిక పునరుద్ధరణ పనులు ముమ్మరంగా చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎక్కడైనా అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు ధ్వంసం అయితే వాటి పునరుద్ధరణకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎస్ తెలిపారు. అదే విధంగా తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. నష్టపరిహారం అందించేందుకు వీలుగా నష్టం వివరాలను సోమవారం వరకు పంపించాల్సిందిగా కోరారు. ఎలాంటి అలసత్యం లేకుండా పునరావాస చర్యలు తీసుకోవాలని కోరారు.