లక్ష్యం 120 జీసీసీలు… 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

  • “వాన్ గార్డ్” జీవీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీl)ను ప్రారంభించి… కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ లో అత్యుత్తమ నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ పార్క్ లో ఏర్పాటు చేసిన “వాన్ గార్డ్ న్యూ ఇండియా ఆఫీస్(గ్లోబల్ వాల్యూ సెంటర్)”ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. హైదరాబాద్ ప్రస్తుతం విశ్వసనీయత, సమగ్రత, ఇన్నోవేషన్ కు చిరునామాగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్‌గార్డ్ తమ ‘గ్లోబల్ వ్యాల్యూ సెంటర్(జీవీసీ)’ ను ప్రారంభించేందుకు హైదరాబాద్ ను ఎంచుకోవడం ఈ నగర సామర్థ్యానికి నిదర్శనమన్నారు. వాన్‌గార్డ్ ప్రపంచవ్యాప్తంగా 6.4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోందని, అలాంటి సంస్థ మన దగ్గర కార్యకలాపాలు ప్రారంభించడం మనకు గర్వకారణమన్నారు. ప్రపంచ ఆర్థిక, సాంకేతిక పటంలో “తెలంగాణ” బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందన్నారు. ప్రస్తుతం వరల్డ్ టాప్ – 7 అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ కంపెనీలు 30 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నాయని వివరించారు. ఈ కొత్త జీవీసీ ఇంజనీరింగ్ ఎక్స్ లెన్స్, క్లౌడ్ మోడర్నైజేషన్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీకి ఒక హబ్ గా సేవలు అందిస్తుందన్నారు. ఇది వాన్‌గార్డ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌లో నూతన ఆవిష్కరణలకు మార్గ నిర్దేశం చేస్తుందన్నారు. వాన్ గార్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పట్టి “రైజింగ్ తెలంగాణ”లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.