కాళేశ్వరం ప్రాజెక్టు లోని అంతర్భాగాలు అయిన మెడిగడ్డ,సుందిళ్ళ,అన్నారం బ్యారేజ్ ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరించేందుకు సన్నాహాలు జరుపుతున్నామన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనంతో నిర్మించిన ఈ బ్యారేజ్ లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిలో పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో ఇదే విషయమై రాష్ట్ర నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా,సలహాదారు ఆడిత్యా నాధ్ దాస్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మెడిగడ్డ కూలిపోవడానికి ,సుందిళ్ళ,అన్నారం బ్యారేజ్ లలో లీకేజ్ లకు తప్పుడు నిర్ణయాలు,సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ,న్యాయ కమిషన్ లు స్పష్టంగా పేర్కొన్నాయని ఆయన తెలిపారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ పై కుడా ఆరోపణలు వచ్చిన నేపద్యంలో అర్హత కలిగిన స్వతంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లను రూపొందించాలని నిపుణులను అదేశించామన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఐ ఐ టి అనుబంధ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.పూణే లోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) ద్వారా జియో ఫిజికల్ ,హైడ్రాలిక్ టెస్ట్ లు నిర్వహించి నష్టం విలువ అంచనా వేసి పనుల పునరుద్ధరణకు అంకురార్పణ చుట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా కురిసిన భారీ వర్షాలతో నీరు చేరుకుందని,15 నుండి 20 రోజులలో నీరు తగ్గిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అందులో భాగంగా మొదట ఐదు సంస్థలను ఎంపిక చేసి అందులో మూడింటిని ఫైనల్ చేస్తామని ఆయన తెలిపారు. డ్యామ్ సేఫ్టీ రంగంలో అనుభవం కలిగి ఉండడంతో పాటు సాంకేతిక సంస్థలతో అనుభందం కలిగి ఉన్న సంస్థలనే ఫైనల్ చేస్తామన్నారు. పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని ఆయాన స్పష్టం చేశారు. గడిచిన అనుభవాల దృష్ట్యా ప్రజా ఆస్తుల పరిరక్షణ నిమిత్తం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పునరుద్ధరణ పనులు చేపట్ట బోతున్నట్లు ఆయన తెలిపారు. డిజైన్ లోపాలు, పనుల నిర్లక్ష్యం ,ఆర్థికంగా జరిగిన అవకతవకలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఇదే విషయంలో విచారణ నిర్వహించిన విజిలెన్స్ శాఖా సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిందన్నారు. అదే విదంగా ఇదే సమీక్ష సమావేశంలో సమ్మక్క-సారక్క, సీతమ్మ సాగర్, సీతారామ సాగర్, చనకా-కోరాట,దేవాదుల, చిన్న కాళేశ్వరం, ఎస్.ఎల్.బి.సి హెలిబోర్న్ సర్వే,డిండి లతో పాటు జూరాల వద్ద నిర్మించ తల పెట్టిన ప్రత్యమ్యాయ బ్రిడ్జి సింగూర్ కాలువ లైనింగ్ పనులను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు.