సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విన్‌గ్రూప్ ఆసియా సీఈవో.. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి

విన్‌గ్రూప్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పె ఆసక్తి కనబర్చారు. శుక్రవారం న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్‌గ్రూప్ కంపెనీ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ యూనిట్లు, బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను స్థాపించేందుకు విన్‌గ్రూప్ ఆసక్తి ప్రదర్శించింది. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విన్‌గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు.

ఫ్యూచర్ సిటీ ఏర్పాటు పట్ల ముఖ్యమంత్రి దార్శనికతను ఆయన అభినందించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డిసెంబర్ 8–9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఫామ్ సాన్ చౌ తో పాటు విన్‌గ్రూప్ చైర్మన్ ఫామ్ నాట్ వూంగ్‌లను ఆహ్వానించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, సెక్రెటరీ కోఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.