పత్తి కొనుగోళ్లపై నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష

నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లాలోని పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశమమై పత్తి కొనుగోళ్లపై సమీక్షించారు. పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం నుండి తలపెట్టిన సమ్మె ను జిన్నింగ్ మిల్లుల యజమానులు విరమించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలియజేయడమే కాకుండా, అప్పటికప్పుడే రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్ తో ఫోన్ ద్వారా మాట్లాడి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లులకు గాను ఇప్పటివరకు 19 మిల్లులను ప్రారంభించడం జరిగిందని, తక్కిన 4 జిన్నింగ్ మిల్లులను కూడా సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, అందువల్ల జిన్నింగ్ మిల్లులు యజమానులు పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మెకు వెళ్లకుండా మిల్లులు నిర్వహించాలని కోరారు . రాష్ట్ర అసోసియేషన్ తో మాట్లాడిన అనంతరం తగు నిర్ణయం తీసుకుంటామని జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు.

ప్రస్తుతం పత్తి రైతులు కేవలం 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే అమ్ముకునేందుకు వెసులుబాటు ఉందని, ప్రభుత్వం దానిని ఇప్పుడు 12 క్వింటాళ్ల వరకు అమ్ముకునేందుకు సడలించడం జరిగిందని, అయితే పత్తి రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి లేదా వ్యవసాయ అధికారి ద్వారా ధ్రువపత్రాన్ని తీసుకువచ్చి పత్తిని ఆమ్ముకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ప్రభుత్వం ఏ ఈ ఓల సాఫ్ట్వేర్ లో 12 క్వింటాల వరకు పత్తిని అమ్మేందుకు అవకాశం కల్పించిన విషయాన్ని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు.రైతులు నాణ్యమైన పత్తిని జిన్నింగ్ మిల్లులకు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ కోరారు.