కోటి మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రభుత్వ సంకల్పానికి మరో ముందడుగు: సీఎం రేవంత్ రెడ్డి

  • “దేశంలోనే తొలిసారి — ప్రతి మహిళా సంఘానికి ఒక్కో బస్సు”
  • “ఒక్కో బస్సుకు నెలకు ₹69,000 అద్దె — మహిళా సంఘాలకు స్థిర ఆదాయం హామీ”
  • “మహిళలకు ఉచిత ప్రయాణం నుంచి బస్సు ఓనర్‌షిప్ వరకు – తెలంగాణ ప్రభుత్వ దూరదృష్టి
  • ‘ఇది మా బస్సు’ — మహిళల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కొలువు తీరిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టింది. అందులో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పరిమితి పెంపు ఒకటి కాగా రెండవది మహిళలకు మేలు చేసే మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళా సాధికారత దిశగా తొలి అడుగు వేసింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళలభాగస్వామ్యం పెంచడానికి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా పలు పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరురాలను చేయాలనే సంకల్పంతో స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలను అందిస్తోంది. క్రమశిక్షణకు, నమ్మకానికి ప్రతీకలుగా నిలిచిన మహిళా సంఘాలకు ఒకపక్క రుణాలను అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబన కోసం పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుతోపాటు మండల మహిళా సమాఖ్యల ఆదాయం పెంపు కోసం SERP ద్వారా దేశంలోనే మొదటి సారిగా 600 బస్సులు కొనుగోలు చేసి TGSRTC కి అద్దెకి ఇచ్చేలా పథకాన్ని రూపొందించింది. మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీని అందిస్తుంది.

ఈ పథకం అమలుకు TGSRTC మరియుసెర్ప్ (SERP) ల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజా రవాణాలో స్వయం సహాయక సంఘాలు కీలకపాత్ర పోషించడంలో ముందడుగు పడింది. మొదటి దశలో సెర్ప్ (SERP) ఐడెంటిఫై చేసిన 17 జిల్లాలలోని 151 మండల మహిళా సమాఖ్యలను ఒక్కొక్కటి చొప్పున 151 బస్సులు కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించింది. రెండవ దశలో 449 బస్సులను కొనుగోలు చేస్తారు. ఒక్కొక్క బస్సుకు 36 లక్షల వ్యయం కాగా అందులో 6లక్షలను మండల మహిళా సమాఖ్య తన సొంత నిధులను ఖర్చు చేస్తుంది. మిగతా 30 లక్షలను కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గా అందించారు. TGSRTC ప్రతి బస్సుకు నెలకు రూ.69,648 అద్దెని చెల్లిస్తుంది. ఇందులో రూ.19,648ఆపరేషన్ ఎక్స్పెండీచర్ గా ఖర్చు చేసుకొంటున్నారు. మిగతా 50 వేలను రుణ వాయిదాగా చెల్లిస్తుంది.ఇప్పటివరకు TGSRTC అయిదు వాయిదాలు విడుదల చేసింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభమైన ఈ పథకంతో మహిళా సంఘాలు లాభాలు గడిస్తున్నాయి.TGSRTC ఇప్పటివరకు 151 మహిళా సమాఖ్యలకు అయిదు కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. TGSRTC కి మహిళా సంఘాలు బస్సులను అద్దెకిచ్చే పథకంతో గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని బస్సులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ప్రైవేటు వ్యక్తుల బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకొని నిర్వహించేది.నేడు మహిళా సంఘాలు RTC కి అద్దె బస్సులను అందజేస్తున్నాయి. ఈ పథకం మహిళా సాధికారతకు, సామాజిక భద్రతకు అండగా నిలుస్తుంది.వారికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది.
ప్రజా ప్రభుత్వ అమలు చేస్తున్న వినూత్న పథకాలతో రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతున్నారు. వివిధ రంగాలలో రాణించి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రభుత్వంఅందించిన సహకారంతో ముందడుగు వేస్తున్నారు.  

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమే కాక ఆ బస్సులకు ఓనర్లను చేయడం చాలా సంతోషకరమైన విషయం బస్సుల పైన ఇందిరా మహిళా శక్తి మండల సమైక్య పేరు చూసినప్పుడల్లా అది మా బస్సు అనే భావం ఆ బస్సుకు మేము ఓనర్లము అనే భావం మాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. దీనికిగాను మా మంత్రి  సీతక్క గారికి మరియు ముఖ్యమంత్రి గారికి మా మండల సమైక్య మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పి. పద్మ, మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఏటూరునాగారం మండలం, ములుగు జిల్లా. మా మండల సమైక్య ద్వారా ఆర్టీసీకి బస్సు అద్దెకు ఇవ్వడం వలన నెలకి 69 వేల రూపాయలు ప్రతి నెల అద్దె ఛార్జీలు రావడం జరుగుతుంది.ఈ విధంగా ఏడు సంవత్సరాలు మా మండల సమైక్య కి ఆదాయం రావడం జరుగుతుంది. ఇలా మా మండల సమైక్యకి ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మాకు సహకరించిన అధికారులకు కృతజ్ఞత తెలియజేస్తూ మమ్మల్ని ఆఫీసర్ బస్సు ఓనర్ లను చేసిన మా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క  గారికి మరియు ముఖ్యమంత్రి గారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసు కుంటున్నాను.