తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్​కు రండి..జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న.. తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్​కు హాజరవ్వాలని.. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ప్రత్యేకంగా ఆహ్వానించారు రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. న్యూఢిల్లీలోని జమ్ముకశ్మీర్ హౌస్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి కలిశారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్​ సమ్మిట్​ ఆహ్వాన పత్రికను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు.

3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్​-2047 విజన్​ డాక్యుమెంట్​‌ను రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. నీతి అయోగ్​ సలహాలు సూచనలతో పాటు.. అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్​ డాక్యుమెంట్​‌ను గ్లోబల్​ సమ్మిట్​‌లో ఆవిష్కరించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు వివరించారు.

ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి,స్వయంగా ఆహ్వానపత్రాన్ని అందచేసిన మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. సమ్మిట్ కు వారు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నానని , గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆశిస్తున్నానని అదేవిధంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నాను అని ఆయన అన్నారు. పౌర సంబంధాల అధికారి, తెలంగాణ సమాచార కేంద్రం, న్యూఢిల్లీ ద్వారా జారీ చేయబడింది.