ప్రజా భవన్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. తెలంగాణ దీర్ఘకాల భవిష్యత్ లక్ష్యాలు, గ్లోబల్ పోటీ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా విజన్ డాక్యుమెంట్ను మరింత సమగ్రంగా, ముందుచూపుతో మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. విజన్ డాక్యుమెంట్ను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచి పారదర్శకతకు, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దావోస్లో జరిగే ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో తెలంగాణ సామర్థ్యాన్ని, అభిలాషను, వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రతిపాదించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను రూపుదిద్దాలని స్పష్టం చేశారు. తదనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో కలిసి ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన సమ్మిట్ వార్ రూమ్ను సందర్శించి, సిద్ధతలు మరియు సమ్మిట్ కార్యకలాపాల పురోగతిని వివరంగా సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పాంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రివర్యుల సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
