ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బుగ్గపాడు పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మంగళవారం నాడు టిజిఐఐసి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. బుగ్గపాడులోని 200 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కు, తెలంగాణా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, ఎంఎస్ ఎంఇ జోన్ లను టిజిఐఐసి ఏర్పాటు చేసింది. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నందున త్వరితగతిన ఏర్పాట్లన్నీ పూర్తిచేయాలని శ్రీధర్ బాబు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో జనవరిలో పరిశ్రమల నిర్మాణాలు మొదలయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. మెగా ఫుడ్ పార్కుకు కేటాయించిన 60 ఎకరాల్లో యూనిట్ల నిర్మాణాలను ప్రారంభించేలా భూకేటాయింపులు పొందిన వారిని కోరాలని తెలిపారు. తెలంగాణా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ను 80 ఎకరాలు, ఎంఎస్ ఎంఇ జోన్ ను 60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లో కొత్తగా వ్యవసాయ, అక్వారంగ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సమావేశంలో టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, డైరెక్టర్ (ఇన్ వెస్ట్ మెంట్స్) మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.