ఏసీబీకి చిక్కిన ఓయూ డీఈఈ శ్రీనివాస్‌

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయంలో బిల్డింగ్‌ డివిజన్‌ డీఈఈ శ్రీనివాస్‌ ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్‌ భవనం మరమ్మతు పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్‌కు చెందిన రూ.14 లక్షలు పెండింగ్‌ బిల్లులు చెల్లించాల్సి ఉండగా, ఆ బిల్లుల క్లియరెన్స్‌ కోసం డీఈఈ శ్రీనివాస్‌ లంచం డిమాండ్‌ చేశారు.

తొలుత సదరు కాంట్రాక్టర్‌ రూ. 6 వేలు ఇచ్చినా.. మరో రూ. 6000 ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు వలపన్నీ డీఈఈ శ్రీనివాస్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కాగా, డీఈఈ శ్రీనివాస్‌ మరో రెండు నెలల్లో రిటైర్‌ కానున్నారు.