గ్రామ స్వరాజ్యానికి కాంగ్రెస్ పునాది : మంత్రి పొంగులేటి- కొత్తగూడెంలో ఐదు నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల అభినందన సభ
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని, ఇది ఇందిరమ్మ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభ గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గెలుపొందిన 400 మందికి పైగా సర్పంచులను, వేలాది మంది వార్డు సభ్యులను మంత్రి శాలువాలతో సత్కరించి అభినందించారు.
కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు
సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… రాజకీయాల్లో ఏ పార్టీ జెండా ఎగరాలన్నా, ఏ నాయకుడి భవిష్యత్తు మారాలన్నా దానికి గ్రామ స్థాయి కార్యకర్తలే పునాది అని కొనియాడారు. గత పదేళ్లలో మునుపటి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, కుట్రలతో వ్యవహరించిందని, కానీ తమ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి గ్రామ స్థాయి నాయకత్వాన్ని బలపరిచిందని పేర్కొన్నారు. “భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 శాతానికి పైగా స్థానాల్లో మూడు రంగుల జెండాను రెపరెపలాడించిన ఘనత మీదే” అని ఆయన ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు.
ప్రతిపక్షాలవి మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయాలు
పంచాయతీ ఫలితాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఓటమిని జీర్ణించుకోలేక గులాబీ పార్టీ పత్రికల్లో అంకెల గారడీ చేస్తూ ప్రజలను మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. నిజాయితీగా గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
కార్యకర్తలకు భరోసా.. ‘నేనున్నానంటూ’ హామీ
కొత్తగూడెం నియోజకవర్గంలో మిత్రపక్షం ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని పొంగులేటి స్పష్టం చేశారు. “మీ శీనన్నగా నేను ఉన్నాను.. ఏ ఒక్క కార్యకర్తకు చిన్న నొప్పి తగిలినా అండగా ఉంటా” అని భరోసానిచ్చారు. తృటిలో ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఆదుకుంటామని, క్రిస్మస్ పండుగ లోపే ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి గెలిచిన వారిని గౌరవించుకుంటామని ప్రకటించారు.
హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని మంత్రి పునరుద్ఘాటించారు. గడిచిన రెండేళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలే ఈ విజయానికి సోపానాలని ఆయన అన్నారు.
