జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

  • ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్ వాలంటీర్స్ బృందాలను ఏర్పాటు చేయాలి
  • నెలాఖరులోపు జిల్లా కలెక్టర్ ల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశం నిర్వహించాలి.
  • ప్రతి జిల్లాలో రవాణా శాఖ, ఆర్టీసీ, పోలీస్, ట్రాఫిక్,విద్యా శాఖ, వెల్ఫేర్ అధికారులు సమన్వయం చేసుకొని రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించాలి..
  • రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు ,డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలి
  • జిల్లా కలెక్టర్ లతో విడియో కాన్ఫరెన్స్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు, ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు లో తీసుకోవాల్సిన కార్యాచరణ పై సచివాలయంలో సిఎస్ కే.రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి లతో కలసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సంవత్సరం తెలంగాణ లో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగగా ,7949 మరణాలు జరిగాయని ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి రాష్ డ్రైవింగ్ , డ్రైవర్ నిరక్ష్యం వల్లే జరిగినట్లు గుర్తించామని ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ రోడ్డు నిబంధనలపై ప్రజలకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల పై అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రోడ్డు సేఫ్టీ పై ప్రతి జిల్లాలో ఏర్పడిన రోడ్ సేఫ్టీ కమిటీ లు ఈ నెలాఖరులోపు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ లకు సూచించారు. దీనిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఆర్ అండ్ బి అధికారి కన్వీనర్ గా ఉంటారు. ఇందులో రవాణా శాఖ , ఆర్టీసీ , విద్యా శాఖ అధికారులు , పోలీస్ , ట్రాఫిక్ , ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో రోడ్ భద్రతా ఫోర్స్ వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో ,పాఠశాలల్లో అధికారులతో కలిసి ఈ టీం అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ బృందాలకు జనవరి 26 న ప్రశంస పత్రాలతో సత్కరించారు. పాఠశాలల్లో రోడ్డు నిబంధనలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ లు చొరవ తీసుకోవాలని సూచించారు. యూనిసెఫ్ సహకారంతో విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్నెస్ పై పాఠ్యాంశాలు చేర్చడం జరుగుతుందని తెలిపారు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి ,డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ప్రతివారికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. స్క్రాపింగ్ పాలసీ ద్వారా ఫిట్నెస్ లేని వాహనాలను తొలగించడం జరుగుతుందన్నారు.

ప్రమాదాలు జాతీయ రహదారుల పైనే అధికంగా అవుతుండడంతో రాత్రి వేళ వాహనాల పార్కింగ్ , వాహనాల బ్రేక్ డౌన్ సమయంలో రేడియం రిఫ్లెక్టర్లు ఉండేలా చూసుకోవాలని , వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారుల్లో ప్రధాన నగరాల్లో ఎన్ఫోర్స్మెంట్ చేసి నిబంధాలను ఉల్లగించే వారికి చలానా లు , వాహనదారులు హెల్మెట్ లు ధరించేలా చేయడం ,సీటు బెల్ట్ పెట్టుకునే విధంగా చేయడం , ట్రిపుల్ రైడింగ్,మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకోవడం చేయడం వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చు.. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు గోల్డెన్ అవర్ లో చికిత్స అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ సమర్థవంతంగా అమలు చేస్తుంది దీని ద్వారా బాధితుడికి ఏడు రోజుల్లో లక్షా 50 వేల వరకు ఉచితంగా అందజేయబడును. రోడ్డు ప్రమాద బాధితులను తక్షణ సహాయం అందించిన వాహనదారులను ప్రోత్సహించడానికి రహవీర్ గుడ్ సమర్థన్ స్కీమ్ ద్వారా 25 వేల్ క్యాష్ అవార్డు తో అందించే పథకం రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు.జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2025 లో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయటం ద్వారా జాతీయ రహదారి మంత్రి నితిన్ గడ్కరీ చేత అభినందనలు పోదామని చెప్పారు.

2026 జనవరి లో జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలు హెల్మెట్ బైక్ ర్యాలీలు , వాక్ థన్ పరుగులు , రంగోలి ముగ్గుల పోటీలు , రోడ్డు భద్రత ప్రతిజ్ఞలు , ఆరోగ్య శిబిరాలు , రక్తదాన శిబిరాలు ,మోటార్ సైకిల్ చిన్న హెల్మెట్ స్టిక్కర్ అతికించడం ద్వారా అవగాహన కల్పించడం , కారు విండ్ స్క్రీన్‌కు చిన్న సీట్ బెల్ట్‌ను అతికించడం ద్వారా అవగాహన కల్పించడం ,అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు – సమావేశాలు, వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, వక్తృత్వ పోటీలు, రోడ్లపై NCC బృందాల ద్వారా అవగాహన ,ఆడియో విజువల్ మార్గాల ద్వారా అవగాహన ,స్థానిక రేడియో మరియు సిటి కేబుల్స్‌లో రోడ్డు భద్రత చర్చలు ,సినిమా థియేటర్లలో అవగాహన స్లైడ్‌లు మరియు వీడియోలు ,హోర్డింగ్‌ల ద్వారా అవగాహన ,కళాకారుల బృందాల చేత అవగాహన ఆర్టీసీ బస్సు కండక్టర్ల ద్వారా కరపత్రాల పంపిణీ, బస్టాండ్లలో హోర్డింగ్‌లు, డిస్‌ప్లేలు మరియు అనౌన్సర్‌ల ద్వారా అవగాహన ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ లకు సూచించారు. అధిక-ప్రమాదకర కారిడార్లు ,బ్లాక్ స్పాట్ లని గుర్తించి వాటిని తొలగించాలి.అవసరమైన చోట ప్రధానంగా రోడ్డు కూడళ్లలో సంకేతాలను ఏర్పాటు చేయాలి. రోడ్డు భద్రత మాసోత్సవం కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లు , ఐపీఎస్ లు , ఆర్టీఏ మెంబర్లు ,నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ లు వార్డు మెంబర్లు అవగాహన కార్యక్రమంలో పాల్గొనేలా రవాణా శాఖ ,పోలీస్ ,ఆర్టీసీ ,ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

చీఫ్ సెక్రెటరీ కే.రామకృష్ణ రావు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కింది స్థాయి నుండి రాజధాని వరకు విస్తృత అవగాహన ద్వారానే మరణాల రేటు తగ్గించవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఓవర్ లోడ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇటీవల ప్రమాదాలకు ప్రమాద కారణం ఓవర్ లోడ్ వల్లే అని సూచించారు. ప్రజల ఆస్తి ప్రాణ నష్టాలను కాపాడే బాధ్యత మన అందరి పై ఉందని జిల్లా కలెక్టర్ లు రోడ్ సేఫ్టీ కమిటీ లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రవాణా శాఖ ఏర్పాటు చేసే కార్యాచరణలో పాల్గొనాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జిల్లా కలెక్టర్ లు , అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ , ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి,ఎంజేపి సెక్రటరీ సైదులు ,నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు ,వివిధ సంక్షేమ శాఖ అధికారులు ,రవాణా శాఖ అధికారులు , పోలీస్ ,ట్రాఫిక్ , ఆర్ అండ్ బి, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.