బి.ఆర్.ఎస్ పాలనలో నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైంది: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక తప్పిదంతోటే ఈ దుర్గతి
  • పి.ఆర్.ఎల్.ఐ. సి ని జూరాల నుండి శ్రీశైలంకు మార్చడం ఆ తప్పిదంలో భాగమే
  • తుమ్మిడిహట్టి నుండి మెడిగడ్డకు మార్చడం ఆ తప్పిదాలలో భాగమే
  • నీటిపారుదల రంగంపై 1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు
  • ప్రాజెక్ట్ ల పేరుతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ఘనత బి.ఆర్.ఎస్ దే.
  • శాసనసభలో మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో నీటిపారుదల రంగాన్ని భ్రష్ఠు పట్టించారని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చరిత్రాత్మక తప్పిదాలతోటే రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి ఇంతటి దుర్గతి ఏర్పడిందని ఆయన దుయ్యబట్టారు. నీటిపారుదల రంగంపై శనివారం రాష్ట్ర శాసనసభలో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొన్న ఆయన కృష్ణా గోదావరి జలాశయాలలో బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జూరాల నుండి రూపకల్పన చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు ను శ్రీశైలంకు మార్చడంతో పాటు తమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మెడిగడ్డకు మార్చడమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చరిత్రాత్మక తప్పిదాలకు నిదర్శనమన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను ముందుకు కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ ముద్ర పడుతుందన్న దురుద్ధేశంతోటే బి.ఆర్.ఎస్ పాలకులు మార్పులకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఫలితంగా తెలంగాణా ప్రాంతంలో నీటిపారుదల రంగం బ్రష్టుపట్టి పోవడమే కాకుండా ఆర్థికసంక్షోభయానికి దారి తీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహ చర్యగా ఆయన అభివర్ణించారు.

బి.ఆర్.ఎస్ పాలనలో లక్షా 83 వేల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేసినప్పుటికీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేక పోయారని ఆయన పేర్కొన్నారు.పైగా ప్రాజెక్ట్ ల పేరుతో 11 నుంచి 11.5 శాతం వడ్డీలతో తెచ్చిన అప్పులు రాష్ట్రానికి ఆర్థిక భారంగా పరిణమించాయన్నారు. పైగా భవిష్యత్ తరాలను అప్పుల ఊబిలో కూరుకు పోయేలా చేశారన్నారు.తాము అధికారంలోకి వచ్చాక వడ్డీల భారాన్ని 11.5 శాతం నుండి 7 శాతానికి కుదించి ఆర్థిక భారాన్ని కొంత మేర తగించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీల భారాన్ని తగ్గించని పక్షంలో రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోయి ఉండేదని ఆయన చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ ను సస్యశ్యామలంగా మార్చనున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రంగా మార్చుకుని జరిపిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో బి.ఆర్.ఎస్ పాలనలో పాలమూరు కు ఉద్దేశ్యపూర్వకంగానే ద్రోహం తలపెట్టారని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదలు రూపొందించిన ప్రకారం జూరాల నుండే కొనసాగిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం కలిగి ఉండేదన్నారు.

కానీ 2022 లో కేంద్ర జలసంఘానికి డి.పి.ఆర్ సమర్పించినప్పుడు భూసేకరణ, కాలువల నిర్మాణం లేకుండానే 32,000 వేల కోట్ల నుండి 55000 కోట్లకు అంచనా వ్యయం పెరిగిందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటే 80,000 నుండి 84,000 వరకు చేరుతుందని దీనికి బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలే కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే బి.ఆర్.ఎస్ నేతలు అందుకు భిన్నంగా 90 శాతం పనులు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారన్నారు. నిజానికి అంచనా వ్యయంలో కేవలం 25 నుండి 30 శాతం నిధులు ఖర్చు పెట్టి 90 శాతం పనులు పూర్తి అయ్యాయి అంటూ అబద్ధాలు ప్రచారం చేయడం ముమ్మాటికి దక్షిణ తెలంగాణా ప్రజలను మోసం చేయడమే నన్నారు.ఇప్పటికి ఆ ప్రాజెక్టుకు అవసరమైన 39,000 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని బి.ఆర్.ఎస్ పాలనలో ఖర్చు చేసిన మొత్తానికి ఒన గురిన ప్రయోజనం ఏమి లేదని ఆయన తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ బి.ఆర్.ఎస్ పాలనలో పేరు మార్చి కాళేశ్వరం పేరుతో నిర్మించడంతోటే ఇంతటి ఆర్థిక విపత్తు సంభవించిందన్నారు.పైగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగాలైన మెడిగడ్డ తో సహా మొత్తం మూడు బ్యారేజ్ ల పరిస్థితి ఏమిటో అన్నది తెలంగాణా సమాజానికి తెలిసిన విషయమే నని ఆయన బి.ఆర్.ఎస్ పాలనపై ఆయన విరుచుకుపడ్డారు.పైగా కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతాంగానికి ఒన గూరిన ప్రయోజనం నిష్ఫలమన్నారు. కృష్ణా-గోదావరి జలాశయాలలో రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాను సద్వినియోగం చేసుకోలేక పోయిన బి.ఆర్.ఎస్ పాలన తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల రంగానికి మరణశాసనం రాసిందని ఆయన విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రెండు టీ.యం.సీ ల నుంచి మూడు టీ.యం.సి లకు పెంచిన బి.ఆర్.ఎస్ పాలకులు 2018 తరువాత అదే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాత్రం 1.5 టి.యం.సి ల నుండి 1 టి.యం.సి కి తగ్గించి తమ కుటిల బుద్దిని చాటుకున్నారన్నారు.అంతే గాకుండా 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని బీరాలు పలికిన బి.ఆర్.ఎస్ పాలకులు ఎందుకు పూర్తి చేయలేదని ఆయన నిలదీశారు. లక్షా 83 వేల కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేయక పోగా ప్రభుత్వం నుండి బి.ఆర్.ఎస్ పాలకులు దిగి పోయేనాటికి 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టగా అందులో నీటిపారుదల రంగం బిల్లులే 10000 కోట్లు ఉన్నాయన్నారు. కృష్ణా నదీ జలాల అంశంపై ఆయన మాట్లాడుతూ 2016 లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంద్రప్రదేశ్ కు 512 టి.యం.సి లు ఇచ్చి తెలంగాణా రాష్ట్రానికి కేవలం 299 టి.యం.సి లకే పరిమితము చేసిన ఘనత బి.ఆర్.ఎస్ పాలకులకే దక్కిందన్నారు. ఇవే కేటాయింపులు 2020 లో కుడా కొన సాగె విదంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఒప్పుకున్న పాపం బి.ఆర్.ఎస్ పాలకులదన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పధకంకు రోజుకు మూడు నుండి నాలుగు టీ.యం.సి ల కు పెంచాడం,పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు రోజుకు నాలుగు నుండి 13 టి.యం.సి లకు పెంచడం తెలంగాణా రాష్ట్రానికి నష్టదాయకంగా మారిందన్నారు.

నీళ్లు-నిధులు-నియమకాల పేరుతో ఏర్పడ్డ రాష్ట్రంలో పదేళ్ళ పాటు సాగిన బి.ఆర్.ఎస్ పాలనలో ఆంద్రప్రదేశ్ ప్రదేశం అక్రమంగా నీటిని దోచుకు పోయారని అందుకు బి.ఆర్.ఎస్ పాలకులు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంద్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నాటి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న సన్నిహిత సంబంధాలే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటి దోపిడీకి పాల్పడడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు.వారిద్దరి మధ్యన జరిగిన సమావేశాలు కూడా ఆంద్రప్రదేశ్ కు లబ్ది చేకూర్ఛాయన్నారు. ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో కుడా ఆంధ్ర ప్రాంతానికి ఇంత స్థాయిలో నీటి కేటాయింపులో జరగలేదని ఆయన ఆధారాలతో సహా సభకు చూపించారు.

అదే సమయంలో తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి లెక్కలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టేలిమెట్రి పరికరాలను అమార్చేందుకు నిర్ణయం తీసుకుందని,రాష్ట్ర విభజన జరిగాక అధికారంలోకి వచ్చిన బి.ఆర్.ఎస్ పాలకులు అధికారంలో ఉన్న సమయంలో అవే తెలిమెట్రి పరికరాలు అమర్చి ఉంటే నీటి దోపిడికి అడ్డు పడి ఉండదన్నారు. ట్రిబ్యునల్ మహారాష్ట్ర,కర్ణాటక,ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లకు కేటాయించిన నీటి వాటాలను గుర్తు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2014 రాష్ట్ర పునర్విభజన సమయంలో ఆంద్రప్రదేశ్ కు కేటాయించిన 811 టి.యం.సి ల నీటి కేటాయింపులలో విభజిత ఆంద్రప్రదేశ్ కు 512 టి.యం.సి లు,తెలంగాణా 299 టి.యం.సి ల కేటాయింపు తెలంగాణా రాష్ట్రనికి బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన చరిత్రాత్మకమైన తప్పిదంగా ఆయన అభివర్ణించారు. వాస్తవాలకు అనుగుణంగా ట్రిబ్యునల్ లో వాదనలు వినిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాశయాలలో 756 టి.యం.సి ల నీటి వాటా కోసం పోరాటం చేస్తుందన్నారు. ఇటువంటి అననుకూల పరిస్థితిలోను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదట రాష్ట్రంలో పంట దిగుబడి రికార్డు సృష్టిస్తోందని కేవలం దిగుబడి లే కాకుండా కొనుగోళ్ల ప్రక్రియ అంతే రికార్డ్ స్థాయిలో తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం కోన సాగిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.