సింగరేణి ఆసుపత్రుల్లో ​మార్చి నాటికి డాక్టర్లు, సిబ్బంది ఖాళీల భర్తీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
  • 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తాం
  • ​అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన

సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్‌లో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో సింగరేణి పై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం 11 మంది కాంట్రాక్ట్ డాక్టర్లు పనిచేస్తున్నారని 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. 176 పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియామకం ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. రామగుండంలో క్యాత్ లాబ్ నిర్మాణం పిపిపి మోడల్ లో చేపడుతున్నామని కాంట్రాక్ట్ అవార్డు కూడా పూర్తయిందని తెలిపారు 75 రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సింగరేణి ఆసుపత్రుల్లో మందుల సౌకర్యం కల్పిస్తున్నామని, సిపిఆర్ఎంఎస్ పథకం అందుబాటులో ఉన్నదని వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులు 8 లక్షల వరకు మందులను తీసుకునే అవకాశం కూడా కల్పించామని చెప్పారు. టెర్మినల్ బెనిఫిట్స్ కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ఖాళీ స్థలాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఇండ్ల నిర్మాణం కొరకు స్థల కేటాయింపు అంశాన్ని బోర్డులు మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సింగరేణి సంస్థని వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులపై అందరిపై ఉందన్నారు.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాల వల్ల రాష్ట్రంలోని బొగ్గు గనులను నేరుగా సింగరేణికి కేటాయించకుండా వేలం నిర్వహిస్తున్నారని, దీనివల్ల ప్రైవేట్ ఏజెన్సీలు రంగ ప్రవేశం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వేలం ప్రక్రియలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి కొన్ని గనులను కోల్పోయిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణిని స్వయంగా వేలంలో పాల్గొనేలా ప్రోత్సహించి కొన్ని బొగ్గు బావులను దక్కించుకునేలా చేశామని వెల్లడించారు. ​ప్రస్తుతం మార్కెట్లో సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు ధర కంటే ప్రైవేట్ సంస్థలు తక్కువ ధరకే బొగ్గును సరఫరా చేస్తున్నాయని, వినియోగదారులు సహజంగానే తక్కువ ధర ఎక్కడ ఉంటే అక్కడ కొనుగోలు చేస్తారని భట్టి వివరించారు. ఈ పరిస్థితి సింగరేణి బొగ్గు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నదని అన్నారు. సింగరేణి మనుగడ, కార్మికుల సంక్షేమం కొరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన పది రోజుల్లోగా సింగరేణి పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సంస్థ సీఎండీ, డైరెక్టర్లతో ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ​ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. కార్మికుల భద్రతకు భరోసా కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కేవలం బ్యాంకుల ద్వారానే కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. సింగరేణిలో విజయవంతంగా అమలు చేస్తున్న ఈ కోటి రూపాయల బీమా పథకాన్ని, అదే తరహాలో విద్యుత్ శాఖలోని డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.