కృత్రిమ మేథ సాంకేతికలో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం నాడు ఆయన హైటెక్ సిటీలో ఎయిడెన్ ఏఐ (Aiden AI) ఇంజనీరింగ్ కేంద్రం విస్తరణ పనులను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఎకో సిస్టం వల్ల ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇవ్వాళ తెలంగాణా వైపు చూస్తున్నాయని ఆయన తెలిపారు. ఎయిడెన్ ఏఐలో ప్రస్తుతం 500 మంది నిపుణులు పనిచేస్తుండగా వచ్చే రెండేళ్లలో మరో 500 మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కృత్రిమ మేథలో నూతన ఆవిష్కరణల ద్వారా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. ఏఐని విస్తృత కార్యకలాపాలకు అభివృద్ధి చేసే సంస్థలను తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని శ్రీధర్ బాబు వివరించారు. కార్యక్రమంలో సంస్థ సిఇఒ కిరణ్ వెంట్రప్రగడ, సిఒఒ శ్రీని కమిడి, కవితా మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.