అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్ నందు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక , రెండు పడకల గదుల ఇండ్లపై మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఇళ్ల మంజూరీలో పారదర్శకతగా వ్యవహరిస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందించటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎల్ వన్ (L1) కింద 4800 మంది అర్హులైన ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు రెండు పడకల గదుల ఇల్లు నిర్మించుటకై నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఎల్ టు (L2) కింద హైదరాబాద్ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై రెండు వేలకు పైగా దరఖాస్తులు వివిధ నియోజకవర్గాల నుండి పేద ప్రజలు అందజేశారని మంత్రి వివరించారు. హైదరాబాద్ మహానగరంలో స్థలాలు సేకరించి జీ + 5-10 వరకు ఇందిరమ్మ ఇల్లు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు..

పెండింగ్ లో ఉన్న 2bhk ఇల్లు పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు సూచించారు.ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి.. లబ్ధిదారులు ఎంత మంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 2bhk లబ్ధిదారులకు అందించమని ఇంకా పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మురికివాడ‌ల్లో ఇందిర‌మ్మ మోడ‌ల్ కాల‌నీలు, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి స్ధ‌లాల సేక‌ర‌ణ‌,అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి, పూర్త‌యిన ఇండ్ల కేటాయింపు త‌దిత‌ర అంశాల‌పై శాసనసభ్యులతో కలిసి మంత్రులు సమీక్షించారు. తదుపరి హైదరాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల శాసనసభ్యుల అభిప్రాయాలను ఈ సందర్భంగా స్వీకరించి చేపట్టే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, పిడి హౌసింగ్ అశోక్ చక్రవర్తి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.