సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్వహించిన ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, ఈఎస్ఐసీ రీజినల్ డైరెక్టర్ రాజీవ్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దూరదృష్టితోనే కనీస వేతనాలు, కార్మికుల హక్కులు, వారి భద్రత కోసం ఈఎస్ఐ కార్పొరేషన్ స్థాపించబడిందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న ఆ నిర్ణయం దేశంలోని లక్షలాది కార్మిక కుటుంబాలకు ఆరోగ్య భరోసాను కల్పించిందన్నారు.
తన కుటుంబానికి కార్మిక సంక్షేమంతో ప్రత్యేక అనుబంధం ఉందని, తన తండ్రి కేంద్ర మరియు రాష్ట్ర కార్మిక మంత్రిగా సేవలందించారని మంత్రి గుర్తు చేశారు. గతంతో పోలిస్తే ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సదుపాయాలు విస్తృతంగా మెరుగుపడ్డాయని తెలిపారు. రోగికి వైద్యంతో పాటు ధైర్యం ఇవ్వడం కూడా వైద్యుల బాధ్యత అని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై విమర్శలు వినిపించినా, ఈఎస్ఐ ఆసుపత్రుల సేవలపై పెద్దగా ఫిర్యాదులు రావని ఆయన అన్నారు . దేశంలోని పేదలకు అత్యవసరంగా అవసరమయ్యేవి విద్య, వైద్యం మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ కాలంలో, ఈఎస్ఐ వంటి సంస్థలు కార్మికులకు నాణ్యమైన వైద్యసేవలను అందించడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు వైద్య సేవల విషయమా లో చిత్తశుద్ధి తో పనిచేస్తోందని, ఈఎస్ఐ సేవలను మరింత విస్తరించేందుకు ముఖ్యమంత్రి శంషాబాద్లో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి భూమి కేటాయించేందుకు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
చెన్నూరులో 50 పడకలతో ప్రారంభమైన చిన్న ఆసుపత్రి ప్రస్తుతం పూర్తిస్థాయిలో సేవలందిస్తోందని మంత్రి తెలిపారు. అలాగే 18 ESIC డిస్పెన్సరీలు రద్దవుతున్నాయన్న సమాచారం అందిన వెంటనే కేబినెట్లో చర్చించి, వాటి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం గొప్ప విషయమని, అవయవదాతలకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈఎస్ఐ ద్వారా కార్మికులకు మరింత విస్తృతంగా, సమర్థవంతంగా సేవలు అందేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.