హైదరాబాద్: ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీఆర్తో సహా బిఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ హాజరై అడిగే ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో మంత్రి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ శాసనసభ్యులు సభకు వచ్చి తమ వాదనలు వినిపిస్తే, ప్రతి విషయానికి సాక్ష్యాధారాలతో సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ, ప్రతిపక్షం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వారి సొంత ఎజెండాతో సభకు వస్తున్నారని అన్నారు
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని ఇండ్ల నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయంపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని దాని ప్రకారం త్వరలో అక్కడి అర్హులందరికీ ఇంటి పట్టాతోపాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ విమర్శల పై..
“ORR పక్కన సంబంధం లేని క్రషర్ నాదని పిచ్చి కుక్కలు చాలా మొరుగుతున్నాయి, నాపై మొరిగే కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో నాకు తెలుసు. ఆ క్వారీ నాదని చిల్లర ఆరోపణలు చేస్తున్నారు, నాకు క్రషర్ నడిపే ఓపిక లేదు. అది నా క్రషర్ కాదు బిఆర్ఎస్ నేతలు చెబుతున్నది తిరుమల క్రషర్, వేస్ట్ క్రష్ చేసి సప్లై చేసే లైసెన్స్ వారికి ఉంది. ఆ క్రషర్ కంపెనీ మా కంటైనర్ తీసుకువెళ్ళింది. దానిపై ఉన్న పేరును తొలగించినట్లు ఉన్నారు. దానిని పట్టుకుని పిచ్చి వాగుడు వాగుతున్నారు. నా పై పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెబుతాను” అంటూ బిఆర్ఎస్ నాయకుల విమర్శలపై తీవ్రంగా స్పందించారు.