- గోదావరి పుష్కరాల కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: వచ్చే ఏడాది జరుగనున్న గోదావరి పుష్కరాల నేపధ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన గోదావరి పుష్కరాల కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి సమగ్ర రోడ్ల అనుసంధానం కల్పించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసే విధంగా ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన చోట రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం ఎంత మేర నిధులు అవసరమో ఆర్థిక పరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. బాసర, భద్రాచలం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలే కాకుండా మధ్యలో ఉన్న ఇతర ప్రముఖ దేవాలయాలకు కూడా సౌకర్యవంతమైన రోడ్ల కనెక్టివిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక రూపొందించాలని మంత్రి తెలిపారు. ప్రధాన రహదారులతో దేవాలయాలను అనుసంధానం చేస్తూ ఒకేసారి సమగ్ర ప్రణాళిక అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాసర దేవాలయానికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఆమోదం ఉన్నందున, భద్రాచలం దేవస్ధానం మాస్టర్ ప్లాన్ ను కూడా ఈ కమిటీలో చర్చించి ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకోవాలని అన్నారు.
