ఎస్.ఎల్.బి.సి ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రతిష్టాత్మక ఎస్.ఎల్.బి.సి ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ నుండి ఔట్లెట్ పనులు ప్రారంభం అయిన నేపద్యంలో ఇప్పుడు ఇన్లెట్ పనులు కుడా ప్రారంభమయిన నేపద్యంలో ఎస్.ఎల్.బి.సి తవ్వకాలు వేగవంతం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో ఎస్.ఎల్.బి.సి తో పాటు, డిండి ఎత్తిపోతల పధకం, అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ పురోగతిపై ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వైపులా తవ్వకాలు ప్రారంభం అయినందున ఇకపై నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాంగ నిలువనున్న ఈ ప్రాజెక్ట్ తవ్వకాలలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నిబంధనలు కటినంగా పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. తవ్వకాల సమయంలో సొరంగ మార్గం చివరికంటూ గాలి వెలుతురు ప్రసారం అయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. యిన్లెట్ వైపు పనులు పునఃప్రారంభం కావడానికి ముందే 20 మీటర్ల దూరం ఓపెన్ కట్ చేయడంతో పాటు అదనపు భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే తవ్వకాలు ప్రారంభించిన ఔట్ లెట్ తవ్వకాలలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి 20 మీటర్ల దూరం పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఏడూ సంవత్సరాలుగా ఔట్ లెట్ పనులు నిలిచి పోయిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ 43.93 కిలోమీటర్ల పొడవైన ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం శ్రీశైలం ఎడమ కాలువ భాగం నుండి మొదలు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది పూర్తి అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా ఇది నిలిచి పోతుందన్నారు. అయితే 2025 ఫిబ్రవరిలో దురదృష్టవశాత్తు జరిగిన ఘటనతో పనులు నిలిచి పోయాయన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణకు ఉన్నత స్థాయి కమిటీ నియమించి,కమిటీ సిఫార్సుల మేరకు పునరుద్ధరణ పనులు ప్రారంభించామన్నారు.