ఉద్యోగస్తులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వహించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • మహనీయుల ఆలోచన మేరకు ముందుకెళ్లాలి.
  • ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీదే కీలక పాత్ర
  • సచివాలయ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కు కృషి చేస్తా
  • సచివాలయంలో మహనీయుల జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ ; మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సచివాలయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్ని రోజులు శక్తి ఉంటే అన్ని రోజులు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యోగుల సంక్షేమ కోసం నిరంతరం పాటుపడతానని స్పష్టం చేశారు. అంబేద్కర్ సూచించిన విధంగా కేవలం చదువు ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో అంబేద్కర్ నాలెడ్జి సెంటర్ అలాగే నింబోలి అడ్డ లో ఒక లైబ్రరీ , హాస్టల్ ను ఏర్పాటుకు బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మహనీయులు చూపిన మార్గంలో ఉద్యోగస్తులందరూ నడవాలని తద్వారా ఆయా వర్గాలకు మేలు కలిగే విధంగా ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను క్షేత్రస్థాయిలో అందేలా ఉద్యోగస్తులదే ఈ యొక్క పాత్ర కాబట్టి అందుకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మనందరం ఒక గొప్ప సందర్భంలో కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తునన్నారు. ఈ ఏప్రిల్ మాసం భారత దేశ చరిత్రలో ఒక విశిష్టమైన నెల అని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ నెలలోనే మహనీయులు అయిన బాబు జగ్జీవన్ రామ్, డా.బి ఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే లాంటి గొప్ప మహానుభావులు గారు జన్మించారనీ తెలిపారు. వీరు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు – ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక సమానత్వ దార్శనికత అని తెలిపారు.

ఈ దేశానికి వారు చేసిన సేవలు అపారమైనవి. సామాజిక న్యాయం, సమాన హక్కులు, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను మనకు అందించారనీ తెలిపారు. ఈ సచివాలయంలో పని చేస్తున్న మన 320 మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తులు కూడా వారి ఆలోచనలను ఆచరణలో పెట్టే బాధ్యతను మోస్తున్నారు. మనం కేవలం ఉద్యోగస్తులు మాత్రమే కాదు ప్రజలకు సేవ చేసే ప్రతినిధులు అని వ్యాఖ్యానించారు. మహనీయులు సూచించిన మార్గంలో మనం ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగస్తుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న భీమా పథకాలు, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ విధానాలు – ఇవన్నీ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయన్నారు. ఇవి కేవలం ప్రయోజనాలు మాత్రమే కాదు, ఉద్యోగులపై ప్రభుత్వ నమ్మకానికి సంకేతాలనీ అభివర్ణించారు. ఇప్పుడు మన బాధ్యత… ప్రజలకు సేవలను పారదర్శకంగా, సమర్థవంతంగా అందించడ మే మన ముందు ఉన్న గొప్ప లక్ష్యం అని అన్నారు. ప్రతి పౌరుడు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకునేలా పనిచేయడం. మన పనితీరు ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కృషి చేయాలని అన్నారు. ప్రజల మన్ననలు పొందాలంటే మన సేవలో నిష్పక్షపాతం, నిబద్ధత, బాధ్యతాయుత దృక్పథం ఉండాలన్నారు. మనం చేసే ప్రతి పని ఒక కుటుంబానికి ఒక భరోసా కలిగించాలన్నారు.

మన మహనీయుల ఆశయాలను గుర్తుచేసుకుంటూ – సమానత్వం, న్యాయం, సేవ అనే మూడు సూత్రాలను మన జీవితంలో అమలు పరుచుకుందాం అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రినీ కోరారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి అడ్లూరి… ముఖ్యమంత్రి గారితో సంప్రదించి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ప్రశాంత్ సలహాదారులు సైదా , ఉద్యోగుల సంఘల సహకార సంఘం అధ్యక్షుడు రెడ్ల రాజేశ్వర్, సునీత అడిషనల్ సెక్రటరీ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.