హైదరాబాద్: ప్రజాభవన్లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక (Annual Action Plan) అమలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, స్త్రీనిధి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్త్రీనిధి ఉద్యోగులంతా కలిసి స్త్రీనిధి స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకోగా, మంత్రి సీతక్క అభినందించారు. సంఘం ఉద్యోగులను ఐక్యం చేయడమే కాకుండా, హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ప్రయోజనాలతోపాటు లక్షలాది మహిళల ఆర్దిక సంక్షేమాన్ని కాపాడాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్దేశించింది. స్త్రీనిధి సంస్థ మన ఇల్లు లాంటిది. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయి” అన్నారు. 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీనిధి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోందన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే స్త్రీనిధి ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు అందించడం గొప్ప విజయమని మంత్రి పేర్కొన్నారు. స్త్రీనిధి అసలు సిసలు మాహిళా బ్యాంక్ అని కొనియాడారు. తెలంగాణ మహిళలకు స్త్రీనిధి ఒక నమ్మకమైన బ్యాంక్గా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ స్త్రీనిధి మోడల్ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు.
“కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది” అని మంత్రి తెలిపారు. దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 18 శాతానికే పరిమితమైందని, అభివృద్ధి చెందిన దేశాల్లో అది 40 శాతానికి చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు కూడా ఆ స్థాయికి ఎదగాలని, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. స్త్రీనిధి సంస్థపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి ఆరోపణలపై వాస్తవాలను ఉద్యోగులు స్పష్టం చేయాలన్నారు.
గత ప్రభుత్వంలో 16 మంది ఉద్యోగులను తొలగించారని, ఇప్పుడు అదే వ్యక్తులు తప్పుడు ఆరోపణలతో సంస్థను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అలాంటి అసత్య ప్రచారాన్ని ఉద్యోగులంతా కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. “మాది ఉద్యోగ అనుకూల ప్రభుత్వం. స్త్రీనిధిలో ఒక్కరిని కూడా తొలగించలేదు. ఇప్పటికే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశాం. సెర్ప్లో వంద శాతం బదిలీలు నిర్వహించాం. స్త్రీనిధిని బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం తప్ప, ఎవరి ఉద్యోగాలను తొలగించడం కాదు” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్త్రీనిధి సంస్థ ఏర్పాటులో, దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన ఎండీ విద్యాసాగర్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న విద్యాసాగర్ రెడ్డిని మంత్రి సీతక్క, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. నూతన నాయకత్వంలో స్త్రీనిధి సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. “స్త్రీనిధి మహిళల కోసం, మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థ. దీనిని కాపాడుకుంటూ మహిళల ఆర్థిక అభివృద్ధికి మరింత బలోపేతం చేయాలి” అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.