రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పంట దిగుబడుల్లో కీలకపాత్ర పోషించే భూసార ఆరోగ్య పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, 90 శాతం సబ్సిడీపై జిప్సం ఎరువులను అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నిర్వహించిన “రైతు నేస్తం” 92వ ఎపిసోడ్ కార్యక్రమంలో రాష్ట్రంలోని సుమారు 1,600 వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యంతో రైతులు, వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ సంచాలకులు బి. గోపి, ఉద్యానవన శాఖ సంచాలకులు యాస్మిన్ భాష, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు, జిప్సం ఎరువులు పంపిణీ చేయబడింది. అనంతరం పచ్చిరొట్ట పంటల సాగు, జిప్సం వాడకం ద్వారా భూసార ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీదేవి రైతులకు సాంకేతిక వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ వ్యవసాయంపై ఆసక్తితో ఆయిల్పామ్ సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్న రైతు మహేష్ రఘునాథపల్లి ఖమ్మం జిల్లా, తన అనుభవాలను వివరించారు.
జిప్సం వాడకం ద్వారా క్షార ప్రభావిత భూముల్లో సాధించిన ఫలితాలను, ఉద్యాన పంటల్లో వచ్చిన లాభాలను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి వివరించారు. అలాగే పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము సాగు ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించిన అనుభవాలను సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన మహేందర్, నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన సూర్యరెడ్డి రైతులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భూసార ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. పంట దిగుబడుల్లో నేల ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తుందని, రైతులు భూసార పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడంలో పచ్చిరొట్ట పంటలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్లు చెప్పారు. గత వానాకాలం–2025లో 0.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను రూ.61.27 కోట్ల సబ్సిడీతో 1,89,395 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు 7.05 లక్షల ఎకరాల్లో పచ్చిరొట్ట పంటల సాగు జరిగినట్లు పేర్కొన్నారు.
వానాకాలం–2026లో 1.39 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ లక్ష్యంగా రూ.113.27 కోట్ల సబ్సిడీతో సుమారు 11.22 లక్షల ఎకరాల్లో సాగు జరిగేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని క్షార ప్రభావిత భూముల పునరుద్ధరణ కోసం “సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ” పథకం ద్వారా 90 శాతం సబ్సిడీపై జిప్సం ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 11,456 మెట్రిక్ టన్నుల జిప్సం పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు, ఇప్పటికే 10 జిల్లాల్లో 3,523 మెట్రిక్ టన్నుల జిప్సం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సబ్సిడీపై అందిస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు, జిప్సం ఎరువులపై క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమం చివరలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు అడిగిన సాగు సంబంధిత సందేహాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సమాధానాలు ఇచ్చారు.