- 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ కింద తీసుకున్న వంశీ మోహన్
- ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో దాడులు
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్గా గతంలో పని చేసిన వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని ఆయనకి సంబంధించిన 8 ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో వంశీ మోహన్కు సంబంధించి.. రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అతడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అధికారులు నమోదు చేశారు. పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తులు కాజేసినట్లు వంశీ మోహన్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. శేరిలింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వంశీ మోహన్ ఆర్డీవోగా పనిచేశారు. అలాగే అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల భూమిని ఆయన కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు భూమిని తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి.. దానిని రియల్టర్కు కట్టెబట్టినట్లు విమర్శలు వచ్చాయి. ఇక ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ కింద వంశీ మోహన్ తీసుకున్నట్లు కూడా ఈ సోదాల్లో ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో వంశీ మోహన్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.