అణగారిన వర్గాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • గురుకుల విద్యలో మరో విప్లవాత్మక అడుగు
  • డిగ్రీ కళాశాలలకు యూజీసీ స్కేలు – కొత్త కోర్సులు, 9 కొత్త సీఓఈలు, ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సాయం
  • టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ మూడో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు
  • అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం
  • 2017 తర్వాత మూడవ సమావేశం

హైదరాబాద్ : సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, ప్రపంచ స్థాయి విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను సామాజిక మార్పుకు ప్రధాన ఆయుధంగా భావిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) మూడవ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని మంత్రి ఛాంబర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, ఉపాధ్యాయ సంక్షేమం, ఉన్నత విద్య అవకాశాల విస్తరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను బోర్డు ఆమోదించింది.

కీలక నిర్ణయాలు:
డిగ్రీ కళాశాలల నిర్వహణ కోసం ప్రత్యేక పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం.
డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు యూజీసీ వేతన స్కేలు అమలుపై సానుకూల నిర్ణయం.
డిగ్రీ కళాశాలలకు న్యాక్ (NAAC) గుర్తింపు సాధించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
ఉన్నత విద్య కోసం దేశ, విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం.
9వ తరగతి నుంచే నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు మరో 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ప్రారంభించాలని నిర్ణయం.
క్రాఫ్ట్ టీచర్లు, ఆర్ట్ టీచర్లను టీజీటీలుగా గుర్తించే ప్రతిపాదనకు ఆమోదం.
సెలవు రోజుల్లో విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు “ఫోన్ మిత్ర” సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయం.
రాష్ట్ర కార్యాలయంలో భర్తీ చేసే పోస్టులకు రోస్టర్ విధానం అమలు చేయాలని తీర్మానం.
భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం.
హైదరాబాద్‌లో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఆధ్వర్యంలో ఫార్మసీ కళాశాల స్థాపనకు సూత్రప్రాయ ఆమోదం.
గురుకుల విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఫౌండేషన్ సెంటర్లను బలోపేతం చేయడం, అదనపు సబ్జెక్ట్ నిపుణులను నియమించడం.
క్రీడలు, వృత్తి విద్య అభివృద్ధి కోసం స్పోర్ట్స్ కోచ్‌లు, వొకేషనల్ లెక్చరర్ల సేవలను కొనసాగించడం.
డిగ్రీ విద్యార్థుల్లో విద్యా ఏకాగ్రత పెంపు కోసం మొబైల్ ఫోన్ వినియోగంపై అమలులో ఉన్న నిబంధనలను కొనసాగించడం.
విద్యార్థుల పోషకాహార ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని గురుకులాల్లో ఉమ్మడి మెనూ విధానాన్ని అమలు చేయడం.
పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల పారితోషికాలను పెంచేందుకు ఆమోదం.
133 విద్యాసంస్థలకు సొంత భవనాలు
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకుల విద్యాసంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానించింది.
విద్యార్థులకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని సభ్యులు అభిప్రాయపడ్డారు.

విద్య ద్వారానే సామాజిక సాధికారత
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్య ద్వారానే సామాజిక సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల పిల్లలు ప్రపంచ స్థాయి విద్యను అందుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకుల విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, ఉన్నత విద్య అవకాశాల విస్తరణ, సాంకేతిక విద్య ప్రోత్సాహానికి మరింత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేష్ ధోత్రే,
బోర్డు ఆఫ్ గవర్నర్ కౌన్సెల్ సభ్యులు ప్రొఫెసర్ కాశీం, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) కంభంపాటి శారద, TGTWREIS కార్యదర్శి సీతాలక్ష్మి, టీజీఆర్‌ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ జి. ఉషారాణి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అభిలాష అభినవ్, ప్రొఫెసర్ డీఎస్‌ఆర్ రాజేందర్ సింగ్, ఓఎస్‌డీ వై.జె. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.