స్వరాష్ట్ర సాధనలో కార్మిక సంఘాలదే అత్యంత కీలక పాత్ర.. ట్రేడ్ యూనియన్ల పోరాటాన్ని కొనియాడిన ఉన్నత స్థాయి కమిటీ

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) మొదటి అంతస్తులో జరుగుతున్న ముఖాముఖి సంప్రదింపుల ప్రక్రియ నేడు (జూలై 10న) అత్యంత పీక్ స్టేజ్‌కి చేరుకుంది. జూలై 6వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ప్రత్యేక సమీక్షా విండోలో భాగంగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ కార్మిక సంఘాల (Trade Unions) నాయకులు, ప్రతినిధులు మరియు అసంఘటిత రంగ కార్మిక శ్రేణులు కమిటీని కలిసి తమ వినతులను సమర్పించారు. నేటి సమీక్షా సమావేశంలో కమిటీకి సంబంధించిన ప్యానల్ సభ్యులు హాజరై, వచ్చిన ప్రతినిధులతో ముఖాముఖిగా సుదీర్ఘ చర్చలు జరిపారు. హాజరైన కమిటీ చైర్మన్ మరియు సభ్యులు: డాక్టర్ కె. కేశవరావు (చైర్మన్), ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్ (ఎమ్మెల్సీ & కమిటీ సభ్యులు), అద్దంకి దయాకర్ (ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ & కమిటీ సభ్యులు), మోతె శోభన్ రెడ్డి (ఎగ్జిక్యూటివ్ మెంబర్), ఎస్. రాములు నాయక్ (ఎగ్జిక్యూటివ్ మెంబర్).

“ఉద్యమానికి కార్మిక సంఘాలే వెన్నుముక” — కమిటీ సభ్యుల ఏకగ్రీవ ప్రకటన
నేటి ముఖాముఖి సమావేశంలో కమిటీ చైర్మన్ మరియు సభ్యులు కార్మిక సంఘాల (Trade Unions) పాత్రపైనే ప్రత్యేకంగా అత్యధిక సమయం మాట్లాడారు. స్వరాష్ట్ర సాధనలో ట్రేడ్ యూనియన్ల పాత్ర అత్యంత కీలకమైన పాత్ర (Key Role) అని ప్యానల్ ముక్తకంఠంతో కొనియాడింది. నాడు ఆర్టీసీ, సింగరేణి, రైల్వే , మరియు BSNL TJAC ఉద్యోగులతో పాటు అసంఘటిత రంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి, ‘సకల జనుల సమ్మె ‘ ద్వారా యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేయడం వల్లే నాటి ఢిల్లీ పీఠం దిగివచ్చిందని కమిటీ గుర్తుచేసింది. కార్మిక లోకం అందించిన ఆ చారిత్రాత్మక ఊపు లేకపోతే తెలంగాణ కల సాకారం అయ్యేది కాదని, అందుకే ఉద్యమ చరిత్రలో కార్మికులకు అగ్రతాంబూలం దక్కుతుందని కమిటీ స్పష్టం చేసింది.

ఉద్యమకారుల ప్రధాన వినతులు — డిమాండ్లు: 1969 నాటి ఉద్యమకారులతో పాటు నేడు హాజరైన వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు కమిటీ సమక్షంలో తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతూ ఈ క్రింది ప్రధాన డిమాండ్లను రాతపూర్వకంగా సమర్పించారు:
ప్రభుత్వ ప్రశంస & అధికారిక గుర్తింపు. నాడు పోరాడిన ప్రతి కార్మిక యోధునికి, ఉద్యమకారునికి ప్రభుత్వ ముద్రతో కూడిన అధికారిక ప్రశంసా పత్రాలు అందించి గౌరవించాలి.
250 గజాల నివాస స్థలం: అర్హులైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి నివాస అవసరాల నిమిత్తం 250 గజాల భూమిని ప్రభుత్వం కేటాయించాలి. ఆరోగ్య భరోసా (Health Benefits): ఉద్యమకారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఉచిత వైద్యం అందేలా ప్రత్యేక హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. గౌరవ పెన్షన్లు (Pensions): వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారుల జీవన భృతి కోసం శాశ్వత ప్రాతిపదికన నెలవారీ గౌరవ వేతనం (పెన్షన్) అందించాలి. ఉచిత రవాణ సదుపాయం.
కమిటీ సభ్యుల కీలక హామీ: కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాట్లాడుతూ.. కార్మికులు అడిగే ఈ సంక్షేమ ఫలాలు ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని, నాడు రక్తం, చెమట చిందించి సాధించుకున్న వారి హక్కు అని ఉద్ఘాటించారు. సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) ద్వారా జరుగుతున్న ఈ పూర్తి స్థాయి డిజిటల్ రికార్డింగ్ ప్రక్రియ ఆధారంగా, ప్రతి ఒక్క నిజమైన కార్మిక ఉద్యమకారుడి పేరును రికార్డుల్లో ఎక్కించి తీరుతామని భరోసా ఇచ్చారు. ఈ వినతులన్నింటినీ క్షుణ్ణంగా క్రోడీకరించి, జూలై 22న షెడ్యూల్ ముగిసిన వెంటనే ఒక పటిష్టమైన, సమగ్రమైన నివేదికను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సమర్పించి, అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు ముగింపు ప్రసంగంలో హామీ ఇచ్చారు.