హైదరాబాద్లో తొలి కరోనా వైరస్ (కోవిడ్-19} కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పురపాలక, పంచాయతీ రాజ్, విద్య, వైద్య శాఖ, రవాణా, పోలీస్, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో మంత్రులు సమీక్షించనున్నారు. ఆయా శాఖల అధికారులు, శాఖాధిపతులు ఈ సమీక్షలో పాల్గొననున్నారు. ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షాసమావేశంలో మంత్రులు చర్చించనున్నారు. కరోనా పాజిటివ్ గా తేలిన యువకుడికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్సనందిస్తున్నామని, ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.