అవినీతి ‘ముత్యం..డీఈ వెంకటరమణ వద్ద 300 కోట్ల అక్రమాస్తులు

  • డీఈ వెంకటరమణ.. బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు.. 300 కోట్ల అక్రమాస్తులు
  • గుట్టల బేగంపేటలో జీ+5, కూకట్‌పల్లిలో జీ+3 వాణిజ్య భవనాలు.. 2కిలోల బంగారు ఆభరణాలు
  • రూ.కోట్ల విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు, భారీ భవనాలు
  • భార్య పేరు మీద 4 కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, పెట్టుబడులు
  • 20 కోట్ల రూపాయలతో 10 అపార్ట్‌మెంట్ల నిర్మాణం..
  • రెండు కిలోలకు పైగా బంగారు ఆభరణాలు స్వాధీనం
  • ఏకకాలంలో ఇండ్లు, ఆఫీసులు, బంధువుల ఇండ్లలో సోదాలు
  • రూ.52 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్‌.. ఇంకా తెరవాల్సి ఉన్న 10 లాకర్లు
  • 2019లో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వెంకటరమణ
  • రెండేళ్లకుపైగా సస్పెన్షన్‌లో.. తర్వాత కీలక పోస్టింగ్‌.. భారీగా అక్రమాస్తులు

ఒకసారి లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయి సస్పెండ్‌ అయినా ఆ అధికారి బుద్ధి మారలేదు. అప్పుడు కేవలం లక్షల్లో సంపాదించిన ఆ అధికారి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. ఏడేండ్ల క్రితం అతని వద్ద రూ.50 లక్షల విలువైన అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇప్పుడు అతని ఆస్తులు చూసి అవాక్కవుతున్నారు. గత ఏడేండ్లలో ఆ అధికారి సుమారు రూ.300 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్టు చెప్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (రెడ్కో) డివిజనల్‌ ఇంజినీర్‌ ముత్యం వెంకటరమణను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఆయన ఇండ్లు, ఆఫీసులు, బంధువుల నివాసాలలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాలలో నిర్వహించిన ఈ సోదాల్లో లభించిన డబ్బు, బంగారం, ఫ్లాట్లు, ప్లాట్లు, భవనాలకు చెందిన పత్రాలు, లగ్జరీ కార్లు, వాచ్‌లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. అతడి భార్య పేరుమీద సైతం నాలుగు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు ఉండగా, వాటి ద్వారా నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు కనుగొన్నారు. మొత్తంగా అతని వద్ద లభించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.300 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ముత్యం వెంకటరమణపై ఏసీబీ సిటీ రేంజ్‌-2 అధికారులు కేసు నమోదు చేశారు. అతని గురించి అంతా ఆరా తీసిన తర్వాత బుధవారం ఉదయం ఏకకాలంలో సదరు అధికారి ఇల్లు, కార్యాలయంతోపాటు ఆయన బంధువులు, సహచరులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో విసృ్తత సోదాలు నిర్వహించారు.

సోదాల సందర్భంగా ముత్యం వెంకటరమణ స్థిర, చరాస్తులు చూసి ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. ఈ సోదాల్లో అధికారిక విలువ ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య పెట్టుబడులు పెట్టిన నాలుగు నిర్మాణ కంపెనీల్లో వాటాలు కలుపుకొంటే మొత్తం అక్రమాస్తుల విలువ బహిరంగ మారెట్‌లో రూ.300 కోట్లను సులువుగా మించిపోతుందని ఏసీబీ వర్గాలు చెప్పాయి. అతడి నాలుగు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.52,02,585 నగదును జప్తు చేశారు. వీటితో పాటు సుమారు రెండు కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, ఖరీదైన విదేశీ గడియారాలు, 19 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణ 2019 డిసెంబర్‌ 12న రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. ఆ సందర్భంగా అతడి ఇంట్లో సోదాలు చేయగా రూ.26.52 లక్షల నగదు, రూ.22.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లభించాయి. పాత, తాజా మొత్తం అక్రమాస్తుల విలువ రూ.28,14,14,700గా ఏసీబీ నిర్ధారించింది. ప్రస్తుతం వెంకటరమణను తమ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు గురువారం ఉదయం కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

పాల్వంచ: వెంకటరమణ సమీప బంధువు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని రాహుల్‌గాంధీనగర్‌ నివాసి రాజు తాసిల్దారి ఇంట్లో కూడా ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేశ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇటు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని డీఈ వెంకటరమణ ఇంట్లో సోదాలు కొనసాగుతున్న సమయంలోనే పాల్వంచలో సైతం తనిఖీలు చేపట్టారు. అయితే పాల్వంచలోని ఆయన బంధువు ఇంట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ పేర్కొన్నారు.

1992లో విద్యుత్‌శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా చేరిన ముత్యం వెంకటరమణ.. తర్వాత హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సెంట్రల్‌ జోన్‌, అల్విన్‌ సెక్షన్‌తోపాటు పలు పోస్టుల్లో పనిచేశారు. ఎక్కువ కాలం ఆపరేషన్స్‌ విభాగంలో కొనసాగారు. తన భార్య స్వప్న, కుమార్తె సాత్విక, కుమారుడు రిత్విక్‌, తండ్రి వెంకన్న, మామ శివరాంబాబు, స్నేహితుడు రవికుమార్‌ పేరిట 2006లో రియల్‌ఎస్టేట్‌ సంస్థలను ప్రారంభించారు. ముత్యం కన్‌స్ట్రక్షన్స్‌, ముత్యం బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌, ప్రైడ్‌ హోమ్స్‌, ముత్యం అండ్‌ ఏఎస్ఎన్‌ఎల్‌ లైఫ్‌స్టయిల్‌ పేరిట సంస్థలను నెలకొల్పి.. కూకట్‌పల్లి, మూసాపేట వంటి ప్రాంతాల్లో రూ.20 కోట్ల వ్యయంతో పది నివాస కాంప్లెక్స్‌లు, రెండు వాణిజ్య సముదాయాలను నిర్మించారు.

  • 4 నివాస ఫ్లాట్లు: శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో
    (విలువ: రూ.1,23,46,000)
  • జీ+3 వాణిజ్య సముదాయం: అంజయ్యనగర్‌, కూకట్‌పల్లి వద్ద 160 చదరపు గజాల స్థలంలో (విలువ: రూ.1,82,00,000)
  • జీ+5 వాణిజ్య సముదాయం: శేరిలింగంపల్లి పరిధిలోని గుట్టల బేగంపేట్‌ వద్ద 250 చదరపు గజాల స్థలంలో
    (విలువ: రూ.2,90,03,550)
  • బ్యాంకుల్లో: నాలుగు బ్యాంక్‌ ఖాతాల్లో రూ.52,02,585
  • బంగారు ఆభరణాలు: 2,094 గ్రాములు (విలువ అంచనా: రూ.40,00,000)
  • వాహనాలు: కియా, మహీంద్రా, బలేనో కార్లు (విలువ: రూ.45,00,000)
  • గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు : విలువ రూ.30,00,000
  • మద్యం సీసాలు: 20 లికర్‌ సీసాలు (19 విదేశీ, 1 ఐఎంఎఫ్‌ఎల్‌ – విలువ 2,50,000) దీనిపై మాదాపూర్‌ ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక కేసు నమోదు చేసింది.
  • కన్‌స్ట్రక్షన్‌ సంస్థల్లో పెట్టుబడులు: తన భార్య పేరుతో నమోదైన నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా.. ఆంజనేయనగర్‌, మూసాపేట, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 10 రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్ల నిర్మాణం. వీటి నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు అంచనా వేశారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ భారీగా ఉంటుందని సమాచారం.