జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలోని ప్రతి విద్యార్థికి రెండు యూనిఫార్మ్ ల చొప్పున నెలరోజుల్లోగా యూనిఫారం లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్ ల తయారీ, పంపిణీ, ఎల్-నినో నేపథ్యంలో చేపట్టిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యూనిఫామ్ లను కుట్టించడానికి 26 వేలమంది స్వయంసహాయక బృందాల మహిళలను గుర్తించామని అధికారులు తెలిపారు. స్కూల్ యూనిఫామ్ ల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, విద్యార్థులకు అందిన స్కూల్ డ్రెస్ లు, షూస్ తదితర స్కూల్ కిట్స్ ల నాణ్యతపై నేరుగా పాఠశాల విధ్యార్థుల నుండే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారని సిఎస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సకాలంలో యూనిఫామ్ లను కుట్టించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, దీనిపై జిల్లా, మండల స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షించాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రంలో 27 శాతం లోటు వర్షపాతం ఐఎండి నివేదికల ప్రకారం దేశంలోనే ఎల్-నినో ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణా ఒకటని, ఇప్పటివరకు రాష్ట్రంలో 27శాతం లోటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కేవలం 7 జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని, మిగతా 385 మండల్లాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. వాతావరణ వివరాలను రాష్ట్రంలోని రైతులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తున్నామని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర లలో కూడా వర్షాలు ఆశాజనకంగా లేవని, ప్రస్తుతం మేజర్ రిజర్వాయర్లలో ఉన్న నీటిని తాగునీటికి నిల్వ చేస్తున్నామని, ఈ నేపథ్యంలో రైతులు వరి మినహా ఇతర ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు వరి సాగు 24 శాతం కంటే తక్కువ నమోదైందన్నారు. సెప్టెంబర్ మాసంలోనూ వర్షాలు అతి తక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసిందని తెలిపారు. వరికీ బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ప్రొత్సహించే విధంగా వాటి ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP) లభిస్తున్నందున ఆ దిశగా రైతులను చైతన్య పర్చాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుత సీజన్ లో ఫామ్ పాండ్స్ ల నిర్మాణం విస్తృతంగా చేపట్టాలని సిఎస్ సూచించారు. ప్రతీ 45 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మండల సమావేశాలను నిర్వహించే విధంగా సంబంధిత అధికారులు ప్రణాకళిలను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ సిఎస్ లు సవ్యసాచి ఘోష్, దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపీ, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ దివ్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ లు పాల్గొన్నారు.