దేశంలోనే నెంబర్ వన్ గా మీసేవ ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్: మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు

  • ఒక్కరోజులోనే రెండు లక్షలు దాటిన మీసేవ లావాదేవీలు
  • తొలిసారి రికార్డు స్థాయిలో మీసేవ కార్యకలాపాలు

ప్రభుత్వ సేవలు, లావాదేవీలను ఆన్లైన్ లో ఒకే వేదిక మీద అందిస్తోన్న మీసేవ మరొక రికార్డును నమోదు చేసింది. శుక్రవారం (31/07/2026) ఒక్క రోజే 2,20,172 లావాదేవీలు నమోదు అయ్యాయి. ఇలా ఒకే రోజు రికార్డు స్థాయిలో మీసేవ కార్యకలాపాలు జరిగాయని సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు వెల్లడించారు. మీసేవ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను మరింతగా అభివృద్ది చేయటం, సేవలను విసృత పరచటం, ఆమేరకు ప్రజల వాడకాన్ని ప్రోత్సహించటంలో ప్రజాప్రభుత్వం చొరవచూపిస్తోంది. దీంతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రాష్ట్ర పౌరులకు వేగంగా, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలను అందించేందుకు మీసేవ వేదికను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో ఎలాంటి అవాంతరాలు లేని లావాదేవీల ద్వారా దేశంలోనే నెంబర్ వన్ గవర్నమెంట్ ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ గా మీ సేవ నిలిచిందని మంత్రి అన్నారు. ప్రతీ రోజు సరాసరి 70 నుంచి 80 వేల కార్యకలాపాలు మీసేవ ద్వారా నమోదవుతాయి. శుక్రవారం ఒకే రోజులో 2.20 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. వీటిల్లో ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఫ్యామిలీ కార్డు, రవాణాశాఖ, ఆదాయ ధృవీకరణ పత్రాల అప్లికేషన్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ సేవల వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందని మంత్రి ప్రకటించారు. పనితీరును మెరుగుపరచడం, సేవల లభ్యతను విస్తరించడం, కొత్త పౌర సేవలను అందుబాటులోకి తీసుకురావడం, సాంకేతిక, మౌలిక వసతులను బలోపేతం చేయడం లాంటి చర్యల ఫలితంగానే ఈ మైలురాయి సాధ్యమైందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు సేవలను అందించడంలో విశేష కృషి చేసిన నిర్వాహకులు, సాంకేతిక బృందాలను మంత్రి అభినందించారు. మీసేవ ద్వారా ప్రస్తుతం ఫ్యామిలీ కార్డు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు, వివిధ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ యుటిలిటీ చెల్లింపులు, అలాగే పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్నాయి. అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలను మీసేవలో చేర్చడం, ఆధునిక సాంకేతికతను వినియోగించడం, సేవల నాణ్యత, వేగం, పారదర్శకతను మరింత మెరుగుపరచడం ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించేందుకు కట్టబడి ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.