హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. దేశంలోని వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లకు ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని, ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను కూడా సమ్మిట్కు ఆహ్వానించాలని సీఎస్ సూచించారు.
అదేవిధంగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, శాస్త్ర–సాంకేతిక, వైద్య, విద్య, మౌలిక వసతులు తదితర రంగాల ప్రముఖులను సమ్మిట్లో పాల్గొనేలా ముందుగానే ఆహ్వానాలు పంపాలని ఆదేశించారు. సమ్మిట్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రతి కమిటీకి స్పష్టమైన బాధ్యతలను అప్పగించి సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలోని వివిధ రంగాల సామర్థ్యాన్ని, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా వివిధ రంగాలకు సంబంధించిన ఎక్స్ పో (Expos)లను ఏర్పాటు చేయాలని, వాటిలో ప్రముఖ కంపెనీలు, సంస్థలు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు.
అలాగే, తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు మార్గదర్శకత్వం అందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులతో కూడిన సలహా మండలి (Advisory Council)ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమ్మిట్ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించి, తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మరింతగా ప్రతిష్టించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.