‎బొగ్గు మైనింగ్ లో కలిసి నడుద్దాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • ‎కర్ణాటక జెన్కో క్యాప్టివ్ బొగ్గు గనులలో జాయింట్ వెంచరుగా పనిచేయడానికి సింగరేణి సిద్ధం
  • ‎‎కర్ణాటక ఇంధన మంత్రికి ప్రతిపాదించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ‎‎సానుకూలంగా స్పందించిన కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె. జె. జార్జ్

‎తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కె.జె. జార్జ్‌తో గురువారం సమావేశం అయ్యారు . రెండు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ పురోగతి, బొగ్గు సరఫరా, బొగ్గు కొనుగోళ్ళ చెల్లింపులు, సాంకేతికత మార్పిడిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. ‎ఈ సమావేశంలో కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రెటరీ గౌరవ్ గుప్తా, సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, కెపిసిఎల్ ఎం.డి రాజేంద్ర చోళన్, కెపిసిఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ నాగరాజు, సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్ మెంట్)  బి. వెంకన్న, జిఎం శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ‎పెరుగుతున్న విద్యుత్తు డిమాండు కు అనుగుణంగా తగినంత బొగ్గును అందించడం కోసం సింగరేణి సంస్థ మరియు కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఒక జాయింట్ వెంచర్ (సంయుక్త భాగస్వామ్యం) గా కలిసి పని చేద్దామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ కె. జె. జార్జ్ కు ప్రతిపాదన చేశారు. ‎పెరుగుతున్న కర్ణాటక విద్యుత్ అవసరాల నేపథ్యంలో కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛత్తీస్ గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో చేపట్టిన క్యాప్టివ్ కోల్ బ్లాక్ లలో బొగ్గు తవ్వకం లో అనుభవం కలిగిన సింగరేణి సంస్థతో ఆ బ్లాకుల్లో మైనింగ్ జరపడానికి ఒక జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పడి కలిసి ముందుకుపోతే బాగుంటుందని డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు.  సింగరేణి సంస్థకు బొగ్గు మైనింగ్ లో దాదాపు 137 సంవత్సరాల అనుభవం ఉందని కనుక కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన బొగ్గు బ్లాక్ లలో మైనింగ్ జరపగలదని, అలాగే కర్ణాటక రాష్ట్రానికి విద్యుత్ రంగంలో ఉన్న అపార అనుభవాన్ని సింగరేణి సంస్థ కూడా తాను చేపట్టబోయే పవర్ ప్లాంట్ ల నిర్వహణలో వినియోగించుకోవచ్చని, ఈ విధంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ సంస్థల పరస్పర సహకారంతో అభివృద్ధి విస్తరణ లక్ష్యంగా ఒక జాయింట్ వెంచర్ సంస్థగా సింగరేణి కె.పి.సి.ఎల్ కలిపి ఏర్పడే అవకాశం పై అధ్యయనం చేయాలని సూచించారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ కె. జె. జార్జ్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రానికి సరఫరా చేస్తున్న బొగ్గు పై కూడా చర్చించారు.

‎కర్ణాటకలో పారిశ్రామిక ప్రగతి కారణంగా విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోందని, థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్వహణకు తెలంగాణ నుంచి  బొగ్గును నిరంతరం సరఫరా చేయాలని కర్ణాటక మంత్రి కె.జె. జార్జ్ కోరారు. ఇందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేటాయింపుల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూస్తామన్నారు. ‎కర్ణాటక రాష్ట్రానికి సింగరేణి సంస్థ ఏడాదికి బొగ్గు లింకేజీ ద్వారా 10.54 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేస్తోందన్నారు. ‎సింగరేణి సంస్థ ప్రస్తుతం కర్ణాటకలోని ఎర్రమారుస్ థర్మల్ పవర్ ప్లాంట్ కు 5.24 మిలియన్ టన్నుల బొగ్గును పూర్తి లింకేజీ ద్వారా సరఫరా చేస్తుందని, పాక్షిక లింకేజీ తో రాయచూరు లోని థర్మల్ పవర్ ప్లాంట్ కు 3.01 మిలియన్ టన్నుల బొగ్గు, బళ్ళారి యూనిట్-3 థర్మల్ ప్లాంట్ కు 2.29 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేస్తున్నామని వివరించారు. రోజుకు కనీసం 4 రేకుల ద్వారా బొగ్గు సరఫరా జరుగుతోందన్నారు.