
రాజన్న సిరిసిల్లజిల్లా కోనారావుపేట మండలం ఎగ్లాసుపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2019 ఏప్రిల్ 15వ తేదీన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన ప్రవీణ్ గత తొమ్మిది నెలలుగా ఎగ్లాసుపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామానికి చెందిన వేములవాడ స్వామి అనే రైతు ఆరు నెలల క్రితం ఇంటి నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వని కార్యదర్శి లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో స్వామి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో రూ. 5వేల లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ కె. భద్రయ్య ఆధ్వర్యంలోని సిబ్బంది రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.