
రంగారెడ్డి జిల్లా దామగుండం రిజర్వు అటవీ ప్రాంతంలో తూర్పు నావికా దళం (ఈస్టన్ నావల్ కమాండ్) ఏర్పాటు చేస్తున్న లో ఫ్రీకె్వన్సీ లైన్ (ఎల్ఎఫ్ఎల్) రాడార్ ప్రాజెక్టుపై యథాతథస్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ ప్రాంతంలో రాడార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అటవీ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా కూలడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అనుమతులు తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర బయోడైవర్సీటీ బోర్డు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, నావికా దళాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దామగుండం రిజర్వు అటవీ పరిరక్షణ ఐకాస దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాజెక్టుకు అనుమతి ఎప్పుడు ఇచ్చారు. షరతులేంటి అని అటవీ శాఖను ప్రశ్నించగా గడువు ఇస్తే కౌంటరు దాఖలు చేస్తామని ప్రభుత్వ సహాయ న్యాయవాది వి. మధుసూధన్ రెడ్డి తెలిపారు. ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి 4 వారాలకు వాయిదా వేసింది.