
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. రమేష్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంది. కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. జస్టిస్ లలిత్ బెంచ్ రేపు విచారణ చేయనుంది.
ఎన్నికల నిలుపుదల అంశంపై ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు లలిత్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు. మరోవైపు ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.