
తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన విషయం విదితమే. 8న బడ్జెట్ను సభలో ఆర్థిక మంత్రి హరీష్రావు ప్రవేశపెట్టారు. కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేశారు. కరోనా, పల్లెప్రగతి అంశాలపై స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టిన అనంతరం ఆ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
8 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో మొత్తం ఆరు బిల్లులు పాస్ అయ్యాయి. ఈ 8 రోజుల్లో 48 గంటల 42 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి.
అయితే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉండే. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముందుగానే సమావేశాలను ముగించారు. కరోనానను కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పబ్బులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.