
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం జరుగనుంది. కరోనా వైరస్ రాష్ట్రంలో దావానంలా విస్తరిస్తుండడంతో.. దానిని అరికట్టేందుకు తీసుకునే చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను అదుపు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకడంతో.. విమానాశ్రయాల్లో వారికి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలనీ, వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని సీఎం తెలిపారు.
ప్రగతిభవన్లో జరిగే ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, అన్ని శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, మంత్రులు.. కేటీఆర్, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా రెడ్డి, మల్లారెడ్డి తదితరులు హాజరవనున్నారు.