పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపుచేసి, వాటి పనితీరుపై పార్లమెంట్‌కు నివేదికలు సమర్పించే పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ పార్లమెంటరీ కమిటీలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి ఏడుగురు కలిపి మొత్తం 22 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రాధాన్య ఓటు ఆధారంగా రెండు సభల నుంచి కమిటీ సభ్యులను ఎన్నుకొంటారు.
సంతోష్‌ తెలంగాణ నుంచి ఈ కమిటీకి ఎంపికైన తొలి ఎంపీ కావడం విశేషం. కమిటీ చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అధ్యయనం చేయడం, వాటి ఖాతాలను పరిశీలించడంతో పాటు, మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుగా ఈ కమిటీ పార్లమెంట్‌కు నివేదికలు ఇస్తుంది. ప్రాధాన్యం కలిగిన పార్లమెంటరీ కమిటీకి ఎంపికకావటంపై ఎంపీ సంతోష్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.