గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన క్రికెటర్ మిథాలీరాజ్..

మొక్క నాటిన మిథాలీ రాజ్

టీమిండియా వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్.. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో భాగమయ్యారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఈ లెజెండరీ వుమెన్ క్రికెటర్ స్వీకరించి, నగరంలోని తిరుమలగిరిలో గల తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. పర్యావరణహితం కోసం తన వంతు కృషి చేసే అవకాశం ఇచ్చిన డీసీపీ గారికి కృతజ్ఞతలు. ఈ మహా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపిన మిథాలీ.. రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్.. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ప్రముఖ క్రీడాపాత్రికేయుడు బొరియా మజుందార్, పారిశ్రామిక వేత్త వాణి కోలాతో పాటు.. నటి కాజల్ అగర్వాల్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మిథాలీ ఛాలెంజ్‌కు నటి కాజల్ వెంటనే స్పందించి.. త్వరలోనే మొక్కలు నాటుతానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.