ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యారోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖతో పాటు తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు హాజరు కానున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడనున్నారు.