
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆంధ్ర లోని వారి వారి స్వస్థలాలకు బయలుదేరగా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వారిని నిలిపివేశారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడు భాస్కర్ రావు, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎస్పీ రంగనాధ్ తో కలిసి అక్కడి పరిస్థితి ని పరిశీలించారు. వెంటనే సీఎం కేసీఆర్ కు పరిస్థితి ని ఫోన్ లో వివరించారు. ఇరు రాష్టల సీఎంలు ఈ విషయంపై చర్చించగా ప్రయాణికులను ఏపీలోకి అనుమతించడానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ పరీక్ష చేసిన తరువాతే ఏపీలోకి అనుమతి ఇచ్చేలాగా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ రోజు రాత్రి వరకు మాత్రమే ఈ సడలింపు ఉంటుందని,ఇక మీదట ఎవ్వరు ప్రయాణాలు చేయవద్దని , సరిహద్దుల వద్ద పూర్తిగా రాకపోకలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు మిర్యాలగూడలో ని రైతు బజార్ ను మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు.. కరోనా వైరస్ వ్యాపి చెందకుండా ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, కర్ఫ్యూ సమయంలో ఇళ్లనుంచి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. కూరగాయల మార్కెట్ లను వికేంద్రీకరణ చేసి పట్టణాల్లో నాలుగు దిక్కులా కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.